ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ శుక్రవారం సాయంత్రం నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఏప్రిల్ 16న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపు కేజ్రీవాల్ విచారణకు హాజరుకానుండగా.. సీబీఐ విచారణకు హాజరవుతున్న తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలవనున్నారు. ఇప్పటివరకు ఏ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు సీబీఐ విచారణకు హాజరుకాలేదు.
అయితే సీబీఐ నోటీసులపై శనివారం కేజ్రీవాల్ స్పందించారు. రేపు ఖచ్చితంగా విచారణకు వెళ్తానంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ తీరుపై కోర్టులను ఆశ్రయిస్తానని చెప్పారు. కోర్టులకు ఈడీ, సీబీఐ తప్పుడు సమాచారం ఇస్తున్నాయని, ఇప్పటివరకు లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయినవారిని వేధించారని ఆరోపించారు. కొందరి పేర్లను చెప్పాలని చందన్ రెడ్డిని వేధించారని అన్నారు. అసలు లిక్కర్ కుంభకోణం అనేదే లేదని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రూ.100 కోట్లు చేతులు మారాయని ఈడీ, సీబీఐ ఆరోపిస్తుందని, ఇప్పటివరకు ఒక్క పైసా కూడా దొరకలేదన్నారు. రేపు సీబీఐ విచారణకు వెళ్లి మోదీకి తాను రూ.వెయ్యి కోట్లు ఇచ్చానంటే నమ్ముతారా? ప్రధానిని కూడా విచారణకు పిలిచి ప్రశ్నిస్తారా? అంటూ ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేయాలని బీజేపీ నుంచి ఆదేశాలు వస్తే సీబీఐ అరెస్ట్ చేస్తుందంటూ కేజ్రీవాల్ తెలిపారు. గోవా ఎన్నికల్లో తాము అక్రమ సంపాదన ఖర్చు పెట్టినట్లు బీజేపీ ఆరోపిస్తుందని, అవన్నీ వాస్తవం కాదన్నారు. తమ పార్టీకి సంబంధించిన లావాదేవీలు చెక్కుల రూపంలోనే ఉన్నాయని కేజ్రీవాల్ చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీని సీబీఐ టార్గెట్ చేసిందని, అందుకే తమ పార్టీ నేతలను ఈ కేసులో కావాలని ఇరికిస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. చాలామందిని ఇప్పటికే అరెస్ట్ చేశారని, కానీ ఒక్క రూపాయి కూడా అక్రమ సంపాదన వారి నుంచి దొరకలేదన్నారు. సీబీఐ చేసే ఆరోపణల్లో నిజాలు ఉండవన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa