ఏపీ బీజేపీ మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం (91) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శ్రీకాకుళం జిల్లా పలాసలోని స్వగృహంలో కన్నుమూశారు. జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుల్లో కణితి విశ్వాథం కూడా ఒకరు. వైద్యుడిగా, విద్యావేత్తగా ఆయన ఎంతో పేరు గడించారు. 1959లో కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 1989, 1991 ఎన్నికల్లో రెండుసార్లు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి హనుమంతు అప్పయ్యదొర, కింజరాపు ఎర్రన్నాయుడుపై విజయం సాధించారు. రాజీవ్గాంధీ ప్రభుత్వంలో 1989లో ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా ఆయన వ్యవహరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కణితికి పేరుంది. విశ్వనాథం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన హయాంలోనే వంశధార రెండో దశ పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం, టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న విశాఖ ఎక్స్ప్రెస్ను పలాస వరకు పొడిగించడంలో విశేష కృషి చేశారు. 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కణితి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ కేంద్ర కమిటీ సభ్యునిగా పార్టీ బలోపేతానికి జిల్లావ్యాప్తంగా ఆయన పర్యటించారు. ఆ తర్వాత వైసీపీకి గుడ్బై చెప్పి 2014 నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు.
నందిగాం మండలంలోని హరిదాసుపురంలో 1932 జులై 1న కణితి దొంగన్న చౌదరి, జానకమ్మ దంపతులకు రెండో సంతానంగా విశ్వనాథం జన్మించారు. ప్రైమరీ విద్యాభ్యాసం స్వగ్రామం హరిదాసుపురంలో, హైస్కూల్ విద్యాభ్యాసం మందస, టెక్కలిలో చదివారు. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి 1957లో వైద్య వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లినా.. మరణించే వరకు వైద్య సేవలందించి ప్రజా వైద్యునిగా పేరుపొందారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా 34 ఏళ్ల పాటు కొనసాగారు. ఆయన భార్య లలిత గతేడాది మృతి చెందగా.. కుమార్తె శారద, కుమారుడు రాజేంద్ర ఉన్నారు. శారద, ఆమె భర్త రాజేష్ ఆస్ట్రేలియాలో డాక్టర్లుగా పనిచేస్తున్నారు.
విశ్వనాథం మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. కణిత భౌతికకాయానికి ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబుతో పాలు పలు పార్టీలకు చెందిన నేతలు నివాళులర్పించారు. ఆయన మృతి జిల్లాకు తీరని లోటని అన్నారు. విశ్వనాథం అంత్యక్రియలను ఇవాళ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మంత్రి అప్పలరాజు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa