విశాఖలో ఇళ్లు అద్దెకు ఇచ్చే యజమానుల్ని పోలీసులు అలర్ట్ చేశారు. కొంతమంది గంజాయి వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో వస్త్రవ్యాపారాలు చేస్తున్నామని.. ఇళ్లను అద్దెకు తీసుకుని, ఇక్కడే వ్యాపారం కొనసాగిస్తున్నట్లు గుర్తించామన్నారు సీపీ త్రివిక్రమ్ వర్మ. యజమానులు ఇళ్లను అద్దెకు ఇచ్చేముందు ఆలోచించి ఇవ్వాలని.. అలాగే ఇల్లు అద్దెకు తీసుకున్నవారి కార్యకలాపాలపై కూడా ఓ కన్నేసి ఉంచాలన్నారు. ఒకవేళ అవసరమైతే గంజాయి అక్రమ రవాణాకు వినియోగించిన ఇంటిని జప్తు చేస్తామని హెచ్చరించారు. నగరం మీదుగా గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఇప్పటికే ఫోకస్ పెట్టామన్నారు.
ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారి వివరాలు తెలుసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. యజమానులు వారికి సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాతే ఇల్లు అద్దెకు ఇవ్వాలని.. ఇటీవల జరిగిన పరిణామాలతోనే తాము అప్రమత్తం చేస్తున్నామంటున్నారు. కొందరు వస్త్ర వ్యాపారం ముసుగులో ఇళ్లు అద్దెకు తీసుకుని అక్కడిన నుంచే గంజాయి దందా చేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో మరింత అప్రమత్తత అవసరమంటున్నారు. విశాఖ మాత్రమే కాదు.. ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు ఎవరైనా సరే ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు.
గంజాయి అక్రమ రవాణా చేసే కేటుగాళ్లు రూటు మార్చేస్తున్నారు. ఎవరికీ దొరక్కుండా గంజాయిని ఊరు దాటించేందుకు ఆయిల్, టాబ్లెట్ల రూపంలోకి కూడా మార్చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు, ఆంధ్ర - ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. హైదరాబాద్, ముంబై వంటి ప్రాంతాలకు గంజాయిని చేరవేసేందుకు హైదరాబాద్ - విజయవాడ హైవేను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ హైవేలో పోలీసులు నిఘా పెంచారు. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీలకు ఈ గంజాయి గ్యాంగులు కొంత మంది స్థానికులతో పరిచయాలు పెంచుకుంటున్నాయి. కొందరు పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి.
విజయవాడ వైపు అయినా, విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ వైపు గంజాయి రవాణపై ఫోకస్ పెట్టారు. సెబ్, టాస్క్ఫోర్స్, నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నాయి. స్పెషల్ టీమ్లు కూడా ఏ కొత్త మార్గాల్లో వెళ్తున్నా సరే పట్టేస్తున్నారు. దీంతో ఈ గంజాయి గ్యాంగులు రూటు మారుస్తున్నాయి.. పోలీసులకు దొరక్కుండా కొత్త ఎత్తులు వేస్తున్నాయి. తాజాగా ముంబైకి రవాణా చేస్తున్న ఒకటిన్నర క్వింటాల గంజాయిని కర్ణాటకలోని బీదర్ జిల్లా చిటగుప్ప దగ్గర పోలీసులు సీజ్ చేశారు. ఈ గంజాయి విలువ రూ.1.56 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని ఏపీ నుంచి తెలంగాణ మీదుగా ముంబైకి తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa