కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వ్యవహారంపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం వాదనలు ముగిశాయి. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, వైఎస్ అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
వాదనలు విన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టేసింది. వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఉత్తర్వులను నిలిపివేసింది. తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని తేల్చిచెప్పింది. సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు హైకోర్టు అలాంటి నిబంధనలను విధించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపైనా ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. అలాగే, వివేకా హత్య కేసు దర్యాప్తు గడువును జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు చేసింది.
ఇదిలావుంటే ఈ నెల 25వ తేదీ వరకు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం ఈ పిటిషన్పై తొలిసారిగా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు హైకోర్టు ఉత్తర్వులను తప్పుబట్టింది. తాజాగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తుది విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని అవినాష్ న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. మంగళవారం హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున అప్పటి వరకు అరెస్టు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ విజ్ఞప్తిని మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్ధంగా ఉంటాయన్నారు. మరోవైపు నిందితులకు లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలని కోరడం కూడా అసమంజసమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఇదిలావుంటే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను కొట్టేసిన తరుణంలో వైఎస్ అవినాష్ తరపు న్యాయవాది.. అరెస్ట్ను ఒక రోజు వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. అయితే జనవరి 23వ తేదీన సమన్లు చేసిన సీబీఐ.. అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదని, ఇప్పుడీ 24 గంటల కోసం రిలీఫ్ ఇవ్వలేమంటూ సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
మరోవైపు ఏప్రిల్ 30వ తేదీ లోపు వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేసి, ఛార్జిషీట్ దాఖలు చేయాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల్లోనే ఈ గడువు ముగియనున్న క్రమంలో.. నెలాఖరులోగా కేసు దర్యాప్తు పూర్తి చేయడం సాధ్యం కాదని సీబీఐ తరపున అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో సుప్రీం కోర్టు బదులిస్తూ దర్యాప్తు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడగించింది. దీంతో సీబీఐకి భారీ ఊరట లభించింది. వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని సీబీఐ నేరుగా కోర్టుకే చెప్పడం.. సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయడంతో ఈ కేసులో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa