తమ డిమాండ్ల సాధన కోసం టీటీడీ పారిశుధ్య కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దాదాపు 2 వేల మంది ఆదివారం నుంచి ఆందోళన కొనసాగిస్తుండగా.. తిరుమల కొండకు వెళ్లకుండా సోమవారం విధుల్ని బహిష్కరించారు. దీంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది.. శ్రీవారి భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందుగానే అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సులభ కార్మికులు సమ్మెను ఇలాగే కొనసాగిస్తే పరిస్థితి ఏంటని టీటీడీ అంచనా వేస్తోంది.
పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఉంది టీటీడీ. తిరుపతి లో టీటీడీ భక్తుల కోసం సేవలందిస్తున్న వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అత్యవసర సర్వీసుల కిందకు వస్తాయి అంటోంది. కాబట్టి వీరు ఆందోళన కు దిగడానికి ముందుగానే యాజమాన్యానికి తెలియజేయాలని.. అలాకాకుండా భక్తులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదంటోంది. కాబట్టి 24 గంటల్లోగా వీరు తమ విధుల్లో చేరక పోతే యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని.. అలాగే ఈ విషయమై టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి టీటీడీ చర్యలు తీసుకుంటామనడంపై కార్మికులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
గత 20 ఏళ్లకుపైగా టీటీడీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నామని.. జీతాలు సరిపోవడం లేదన్నారు కార్మికులు. టీటీడీ జీతాలు పెంచకపోగా ఉన్న జీతాలను తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. తమను కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా టీటీడీలో విలీనం చేయాలని కోరుతున్నారు. డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఆదివారం కూడా పారిశుధ్య కార్మికులు తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ దగ్గర మెరుపు సమ్మె చేశారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా పనిచేశామని.. ఆ సమయంలో చాలామంది కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. టీటీడీ వెంటనే తమ సమస్యలపై స్పందించి.. కార్పొరేషన్ పద్ధతిలో కానీ.. టీటీడీ ఆధీనంలో కానీ పనిచేస్తామని కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయబోమంటున్నారు.
తమకు టైంస్కేలు, గుర్తింపు కార్డులు, లడ్డూ కార్డులు, శ్రీవారి దర్శన సౌకర్యం, స్విమ్స్లో ఉచిత వైద్య సేవల్ని అందించాలంటున్నారు. తమను టీటీడీ కార్పొరేషన్లో విలీనం చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకూ సమ్మెను కొనసాగిస్తామంటున్నారు.. ఈ మేరకు టీటీడీ ఆరోగ్యశాఖ అధికారికి కార్మికులు నోటీసు అందించారు. అధికారులు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించినా కార్మికులు వెనక్కు తగ్గడం లేదు. సమాన పనికి సమాన వేతనమిచ్చి.. సుప్రీం కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa