దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. అలాగే ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ ఆవరణలో దక్షిణ, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో వచ్చే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు అధికారులు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు పడ్డాయి. ఒకటి రెండుచోట్ల భారీ వానలకు అవకాశం ఉంది. అలాగే ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీలో వర్షాలు పడుతున్నాయి. కొద్దిరోజులుగా ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఆదివారం వానలు పడ్డాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిడుగులు పడి ఆరుగురు మరణించారు. వర్షాలతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లగా మారింది. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. వచ్చే మూడురోజులు ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు సోమవారం.. శ్రీకాకుళం,మన్యం, విజయనగరం, విశాఖ,అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉభయగోదావరి,కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ అలర్ట్ చేసింది. ఉరుములు మెరుపులతో వర్షం ఉన్నప్పుడు చెట్ల కింద ఉండకూడదు. పొలంలో రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అంతేకాదు విపత్తుల సంస్థ నుంచి ఈ అలెర్ట్ మెసేజ్ అందినపుడు ఆయా ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల కింద,టవర్స్,పోల్స్, చెరువులు పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచనలు చేశారు.
మరోవైపు అకాల వర్షాలు, ఈదురుగాలులతో రైతులు పంట నష్టపోయారు. పలు జిల్లాల్లో వరి ధాన్యం వానకు తడిపోయింది. గాలుల దెబ్బకు అరటి, నిమ్మ, మామిడి తోటల్లో కాయలు నెలరాలడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa