ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదవికి రాజీనామా చేశాను కానీ పార్టీకి కాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 01, 2023, 11:45 AM

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి చేసిన రాజీనామాపై అనిశ్చితి కొనసాగుతోంది. రాజీనామాపై వెనక్కి తగ్గేదే లేదని, అలాగని పార్టీ కార్యక్రమాలకు దూరం కానని బాలినేని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను.. అధిష్ఠానంలోని ఒకరిద్దరు నాయకులు రండి మాట్లాడదామంటూ నేరుగా ఫోన్లోను, మరికొందరు తమ పీఏల ద్వారా ఆహ్వానించినట్లు తెలిసింది. ఇంకోవైపు ప్రకాశం జిల్లా నుంచి పలువురు నేతలు ఆదివారం హైదరాబాద్‌ వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ‘వివిధ కారణాలతో పార్టీ పదవిని వదులుకున్నా. పూర్తి సమయాన్ని ఒంగోలు నియోజకవర్గానికే కేటాయిస్తా. పార్టీ కార్యక్రమాలన్నింటిలో పాలుపంచుకుంటా. మళ్లీ జగన్‌ సీఎం కావటమే లక్ష్యంగా పనిచేస్తా’ అని బాలినేని వారితో స్పష్టంచేశారు. 2-3 రోజుల్లో ఆయన ఒంగోలు వస్తారని చెబుతున్నారు. వాస్తవానికి బాలినేని శనివారం ఉదయం సీఎంవో అధికారి ధనుంజయరెడ్డికి ఫోన్‌చేశారు. తాను తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాల కో-ఆర్డినేటర్‌ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, పార్టీ అధినేత జగన్‌కు తెలియజేయాలని చెప్పినట్లు తెలిసింది. వెంటనే ఆయన స్పందించి.. ‘ఇదేంటి.. మీరు ఎక్కడున్నారు? తాడేపల్లి రండి మాట్లాడదాం’ అని కోరారు. తర్వాత ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మరికొందరు కీలక నాయకులు కూడా ఆయనకు ఫోన్‌చేసి మాట్లాడినట్లు తెలిసింది. ‘మనం ఏ ప్రాంత బాధ్యతలను చూస్తున్నామో.. అక్కడ పార్టీ నాయకులు చెప్పిన అంశాలను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోకపోతే మనం ఆ పదవిలో ఉండి ఏం లాభం? మంత్రి పదవి వదులుకుని అందరికంటే ముందుగా జగన్‌ కోసం వచ్చిన నాకు జిల్లాలోనే ప్రాధాన్యం లేకపోతే బాధవేయదా’ అని బాలినేని కొందరు నేతలతో అన్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని వారు సీఎంవో అధికారులకు, సజ్జలకు చేరవేశారని సమాచారం. అయితే బాలినేని రాజీనామా నిర్ణయంపై సీఎం జగన్‌ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, ఆయన పెత్తనం పోయినట్లేనని జిల్లా నాయకుడొకరు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa