ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు నుంచి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సులు,,,వచ్చే వారం నుంచి సర్వీసులు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 01, 2023, 09:33 PM

నెల్లూరు, తిరుపతి ఈ రెండు నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. నెల్లూరు బస్టాండ్‌ నుంచి బస్సుల్ని ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.. మరో వారం రోజుల్లో సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ బస్సుల కోసం నెల్లూరు-2 డిపోలో బస్సుల ఛార్జింగ్‌కు ఆరు డీసీ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. గతవారం 12 విద్యుత్తు బస్సులు డిపోకు వచ్చాయి. అద్దె ప్రాతిపదికన ఏపీఎస్‌ ఆర్టీసీ నడిపే ఈ ఏసీ బస్సులు నెల్లూరు నుంచి తిరుపతికి నాన్‌స్టాప్ సర్వీసులుగా నడవనున్నాయి. ప్రయాణికులు ఆసక్తి చూపిస్తారని అధికారులు భావిస్తున్నారు.


ఎంఈఐఎల్‌ (మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌) ఆధ్వర్యంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తయారు చేసింది. మూడు గంటల్లోనే ఈ బస్సు ఫుల్‌ ఛార్జింగ్‌ అవుతుంది.. ఈ పూర్తి ఛార్జింగ్‌తో 180 కి.మీ. ప్రయాణిస్తుందని తెలిపారు. ఒక యూనిట్‌ విద్యుత్తుతో కి.మీ. ప్రయాణించొచ్చు. ఆర్టీసీ డీజిల్‌ బస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సులకు మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ బస్సుల్లో 25 సీట్ల కెపాసిటీ కాగా.. మరో 25 మంది నిల్చొనే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్‌ తలుపులతో పాటు సీసీ కెమెరాలు, అనౌన్స్‌మెంట్‌ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. 2030 నాటికి రాష్ట్రంలో 50 శాతం విద్యుత్తు బస్సులను నడిపేలా టార్గెట్ పెట్టుకున్నారు.


ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుపతి-తిరుమల మధ్య నడుపుతున్న సంగతి తెలిసిందే. అదే బస్సులను నెల్లూరు నుంచి నడపబోతున్నారు. తిరుపతి- తిరుమల మధ్య నడిచే బస్సులకు భక్తుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. 90 శాతం సీట్ల ఓఆర్‌తో నడుస్తున్నాయి. అంతేకాదు తిరుమలలో నడిచే ధర్మ రథాలను కూడా ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు తిరుపతి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఈ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


తిరుపతికి మొదటి విడతలో ఇచ్చిన 100 ఏసీ బస్సుల్లో.. 50 తిరుమల- తిరుపతికి నడుస్తున్నాయి. అలాగే మరో 14 బస్సులు తిరుమల-రేణిగుంట మధ్య.. అలాగే 12 తిరుపతి-నెల్లూరు, 12 తిరుపతి-కడప, 12 తిరుపతి-మదనపల్లికి నడపబోతున్నారు. తిరుపతి నుంచి నెల్లూరుకు వచ్చే బస్సుల ఛార్జింగ్‌ కోసం పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల సూచనలతో వచ్చే వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని.. ఈ బస్సులకు కచ్చితంగా ప్రయాణికుల నుంచి ఆదరణ వస్తుందని అంచనా వేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa