తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిస్తే తమ పార్టీకి భవిష్యత్తు లేదని.. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా తమ పార్టీని ఓడించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. అది తమ దురదృష్టం.. తమ పార్టీ దురదృష్టం అన్నారు.
తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిశాయంటే తమ పార్టీ పని అవుట్ ఆయన అన్నారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు స్థానికంగా బలం కలిగిన ఐదారు మంది నాయకులు రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలవవచ్చునని చెప్పకొచ్చారు. ఇప్పటికీ రాయలసీమలో తమ పార్టీకి ఎంతో కొంత బలం ఉందని.. అక్కడ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే తమ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడింది తప్పయితే.. సోము వీర్రాజు మాట్లాడింది కూడా తప్పే అన్నారు. ఎవరి అభిప్రాయాన్ని వారు చెబితే నోటీసులు ఇస్తామని కొందరు నాయకులు పేర్కొన్నారని.. టీడీపీతో కలిసి పోటీ చేసేది లేదని వీరికి ఎవరు చెప్పారన్నారు. ప్రజల కోసం కలిసిన పార్టీలు కొన్నిచోట్ల ఒకరు, మరికొన్ని చోట్ల మరొకరు పోటీ చేస్తే, అన్ని పార్టీల ఓట్లు కలిసిపోతాయన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోని ఫలితాలే పునరావృతమవుతాయని.. రానున్న ఎన్నికల్లో రెండవ స్థానంలో తన ప్రస్తుత పార్టీ ఉంటుందన్నారు.
కచ్చితంగా ప్రజలను గెలిపించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావలసిన అవసరం ఉందని అన్నారు. ఇక్కడ పార్టీల గెలుపు ముఖ్యం కాదన్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసిపోయారని.. ఇక నాయకులు కలవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల సిద్ధాంతం కోసం కొంత మంది అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలలోనూ పొత్తు వ్యతిరేకించేవారు లేకపోలేదని.. పంచాయితీ ఎన్నికల సందర్భంగా నరసాపురం నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేసి విజయం సాధించాయన్నారు. క్యాడర్ ఎప్పుడో కలిస్తే, లీడర్లు ఇప్పుడు కలిశారని అన్నారు.
వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్పై రఘురామ సెటైర్లు
రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కలిస్తే తమ పార్టీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే అన్నారు. ఆ రెండు పార్టీలు కలవనున్నాయని.. రాష్ట్రంలో పొత్తుల గురించి సోము వీర్రాజు కాదు ఢిల్లీ పెద్దల మాట చెల్లు బాటు అవుతుందన్నారు. రాష్ట్రంలో గతంలో 50 % ఓటు బ్యాంక్ ఉన్న తమ పార్టీ ఓటు బ్యాంకు ఇప్పుడు గణనీయంగా తగ్గిందని, టీడీపీకి కష్టకాలంలోనూ 40% ఓటు బ్యాంకు ఉండగా.. ఇప్పుడు ఆ పార్టీ ఓటు బ్యాంకు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. టీడీపీ ఓటు బ్యాంకుతో పాటు జనసేన, బీజేపీల ఓటు బ్యాంకు కూడా కలిస్తే మంచిదే అన్నారు. ప్రధాన ప్రతిపక్షంతో పాటు రెండవ ప్రతిపక్షం కూడా కలిస్తే ప్రజలకు ప్రయోజనం అన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోయారన్నారు. గతంలో దమ్ముంటే అందరూ కలిసి రండి అని చెప్పిన సింగల్ సింహం ఎందుకో వణుకుతోందన్నారు. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఉండకూడదని చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని చేశారని.. చంద్రబాబు,పవన్ కళ్యాణ్లు ప్రజా సమస్యల గురించి చర్చించుకొని.. ప్రజల కోసం కలిసి ముందుకు వెళ్లాలని, ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వకూడదని నిర్ణయించుకున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని వ్యక్తిగత కక్షతోనే వేధిస్తున్నారన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు వాసులను కుటుంబ సభ్యులు కూడా చూడడానికి అనుమతించలేదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa