తిరుమలలో టీటీడీ ఉద్యోగులు చేపట్టిన సుందర తిరుమల-శుద్ధ తిరుమల సామూహిక పరిశుభ్రత కొనసాగుతోంది. ఈ కార్యక్రమం అద్భుతంగా విజయవంతం కావడంతో తిరుమలను ప్లాస్టిక్ రహిత వాతావరణంగా తీర్చిదిద్దేందుకు మే 13న సామూహిక శ్రమదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని సేవాసదన్ 2లో జిల్లా కలెక్టర్ వెంకట్రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్రెడ్డితో పాటు టీటీడీలోని అన్ని విభాగాధిపతులు, ప్రిన్సిపాళ్లు, మెడికల్ సూపరింటెండెంట్లతో ఈవో సమావేశం నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పారిశుద్ధ్య నిర్వాహణలో స్ఫూర్తిదాయకంగా పనిచేసిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈవో. గత రెండు రోజులుగా పారిశుధ్య పనులు జరుగుతున్నాయన్నారు. ఇదే స్ఫూర్తితో తిరుమలలోని ఘాట్రోడ్లు, నడక మార్గాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు విభాగాధిపతులు, ఉద్యోగులు సన్నద్ధం కావాలని ఈఓ పిలుపునిచ్చారు. 'ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు మనమందరం నాలుగు గంటల పాటు సాగే సామూహిక శ్రమదానంలో పాల్గొనాలన్నారు. రెండు ఘాట్లలో దాదాపు 500, ఫుట్పాత్ రూట్లలో దాదాపు 1000 మంది ఉద్యోగులు ఆ రోజు సేవలు అందిస్తారు' అన్నారు.
చాలా మంది సులభ్ కార్మికులు సోమవారం తమ విధుల్లో చేరారని.. మరో రెండు రోజుల్లో దాదాపు అందరూ తిరిగి వస్తారని చెప్పారు. అయితే ఈ శ్రమదాన యజ్ఞానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించడంతో పాటు టీటీడీ ఆదర్శంగా మారడంతో ప్రతినెలా కొనసాగుతుందన్నారు. కాబట్టి తిరుమలలో నెలకొకసారి మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేస్తూ మహాత్మాగాంధీ అందించిన స్వచ్ఛ్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్నారు. తిరుమల పరిసరాలను శుభ్రపరిచే అవకాశం తమకు కల్పించాలని టీటీడీని అడుగుతున్న భక్తుల్లో కూడా శుద్ధ తిరుమల ఉద్యమం స్ఫూర్తిని నింపిందని ఆయన అన్నారు.
తిరుమలలో మే 14 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న హనుమజ్జయంతి ఉత్సవాలలో భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జేఈవో అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అంజనాద్రి ఆకాశ గంగ, నాద నీరాజనం వేదికలపై ప్రతిరోజు అన్నమాచార్య, దాససాహిత్య, హెచ్డిపిపి ప్రాజెక్టుల కళాకారులచే ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీ హనుమంతుని జన్మ విశేషాలపై ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేయాలన్నారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేదపండితులతో కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్వీ బీసీ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa