ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిచ్చుక మీద ‍బ్రహ్మాస్త్రం అవసరమా...ఎంపీ మార్గాని భరత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 02, 2023, 07:51 PM

ఆదిరెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ  మార్గాని భరత్ అన్నారు. పిచ్చుక మీద ‍బ్రహ్మాస్త్రం అవసరమా అని ప్రశ్నించారు. జగజ్జననని చిట్‌ఫండ్స్‌ పేరుతూ ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో ఆదిరెడ్డి కుటుంబం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఆదిరెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్స్ చూపించారని పేర్కొన్నారు. అందుకే చిట్‌ ఫండ్స్‌ చట్టం సెక్షన్-5 ప్రకారం అరెస్టులు జరిగాయని వివరించారు. సాధారణంగా 20 వేల నుంచి క్యాష్ రిసిట్స్ తీసుకోవడానికి అవకాశం లేదని.. కానీ, జగజ్జననిలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారని ఎంపీ మార్గాని భరత్ చెప్పారు. ఎక్కడా నిబంధనలు పాటించలేదన్నారు. అక్రమాలు చేసే సంస్థలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు. జగజ్జనని కూడా మార్గదర్శిలాంటిదే అని.. జగజ్జనని బాధితులు ఎంతో మంది ఉన్నారని పేర్కొన్నారు.


తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నాయకులు స్కామ్‌లు చేస్తున్నారని, రాజమహేంద్రవరంలో జగజ్జనని చిట్స్‌ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని మార్గాని భరత్ అన్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో ప్రైవేటు ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఎంపీ భరత్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆదిరెడ్డి కుటుంబం విషయంలో కక్ష సాధింపులకు పాల్పడుతున్నామని కొందరు అంటున్నారని తప్పుబట్టారు.


తాముము వ్యక్తిగత దూషణ చేయడం లేదు. ప్రభుత్వంపై అనవసరంగా చేసిన ఆరోపణల గురించే మాట్లాడుతున్నామని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. కేవలం రాజకీయ నేపథ్యం ఉండటం వల్ల ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో ఆదిరెడ్డి కుటుంబం అక్రమాలకు పాల్పడిందని వ్యాఖ్యానించారు.


టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులు చిట్ ఫండ్స్ కంపెనీ అవకతవకలే వీరి అరెస్టుకు కారణమని ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. రాజకీయాలను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు దోచుకుంటున్నారని, కానీ ప్రజా సంక్షేమం కోసమే సీఐడీ దాడులు చేస్తోందన్నారు. కాల్‌మనీ, ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు.


ఇక, మహానాడు కోసం టీడీపీ నేతలను అరెస్టు చేశారన్న ఆరోపణలపై ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ఇలాంటి అవసరం తమకేంటని ప్రశ్నించారు. టీడీపీలో ఆర్థిక నేరగాళ్లు ఉంటే గాని మహానాడు నిర్వహించలేరా అని నిలదీశారు. టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థలను రద్దుచేస్తాం, సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని మహానాడులో తీర్మానం చేయగలరా అని సవాల్ విసిరారు.


వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. చిట్‌ఫండ్స్ అవకతవకాల్లో అరెస్టయి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. నేరస్తులు ఎవరైనా చట్టానికి ఒక్కటే అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని, ప్రజలు ఇలాంటివన్నీ గమనిస్తున్నారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa