ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు...ఆందోళనలో రైతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 02, 2023, 07:52 PM

అకారణంగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకుద్రోణి అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటూ పొరుగు ఉనన తమిళనాడు, దక్షిణ కర్ణాటక, కేరళలో ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వానలు కురుస్తాయంటున్నారు.


ఏపీలో మరో మూడు రోజులు వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో పాటూ ఈదురుగాలులు వీస్తాయి అంటున్నారు. విస్తారంగా, అక్కడక్కడా భారీగా వానలు పడతాయంటున్నారు. మంగళ, బుధవారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఆరుబయట పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.


ఏపీలో వర్షాలపై విపత్తుల సంస్థ కూడా అప్రమత్తం చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఈ వానలు పడతాయి అంటున్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి జల్లులకు అవకాశం ఉంది అంటున్నారు.


మరోవైపు అకాల వర్షాలతో రైతులు నష్టపోయారు. పంట దెబ్బతిని, పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వనాలతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, మిరప, పసుపు కల్లాల చుట్టూ నీళ్లు చేరడంతో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకున్నారు. పంటను కాపాడుకోవడానికి పట్టలు కప్పినా సరే ఈదురు గాలులతో పట్టలు పక్కకు జరిగిన పంటలు తడిచిపోయాయంటున్నారు. అక్కడక్కడా కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది. అలాగే రోడ్లపై ఆరబెట్టిన, రాశులుగా పోసిన ధాన్యం కిందకు నీళ్లు చేరాయి.


ఈదురు గాలుల దెబ్బకు మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు.. అలాగే మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెప్పడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాగే ఈ ఈదురు గాలులతో కొన్నిచోట్ల స్తంభాలు నేల కూలాయి.. దీంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో పంటలకు నష్టం జరిగిందంటోంది వ్యవసాయశాఖ. పంట నష్టం వివరాలను సేకరిస్తున్నామని.. రైతులను ఆదుకుంటామని తెలిపారు.  ఇటు తెలంగాణలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. హైదరాబాద్ సహా జిల్లాల్లో మరో మూడు రోజలు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ వానలతో ధాన్యం తడిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa