మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. తెలంగాణ హైకోర్టు ఇటీవల బెయిల్ రద్దు చేసింది.. కోర్టు ఆదేశాలతో ఆయన లొంగిపోయారు. హైకోర్టు బెయిల్ రద్దు చేసిన సమయంలో 5 తేదీ లోపు లొంగి పోవాలని సూచించింది. తన లాయర్ సలహా మేరకు లొంగిపోయినట్లు చెప్పారు.
వైఎస్ వివేకా కేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ-1గా ఉన్నాడు. 2019 మార్చి 28న పోలీసులు అరెస్టు చేశారు.. అయితే అరెస్ట్ చేసిన 90 రోజులు గడచినా చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో 2019 జూన్ 27న కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సీబీఐ గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్ను కొట్టేసింది. దీంతో సుప్రీం కోర్టులో సీబీఐ అప్పీల్ చేసుకుంది. గంగిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని వాదనలు వినిపించింది. ఒకవేళ ఆధారాలు ఉంటే డీఫాల్ట్ బెయిల్ రద్దు చేయొచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది.
బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ కావడంతో తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యింది. సీబీఐ కోర్టులో వాదనలు వినిపించింది. ఎర్ర గంగిరెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని సీబీఐ అభ్యంతరం తెలిపింది. సాక్ష్యులను బెదిరించే ప్రయత్నాలు చేశారని.. సాక్షాలను తారుమారు చేస్తున్నారని వాదనలు వినిపించింది. దీంతో తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. ఈ నెల 5లోపు కోర్టులో లొంగిపోవాలని సూచించింది. దీంతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు.
ఇటు సీబీఐ వివేకా హత్య కేసులో దూకుడు పెంచింది. ఈ కేసులో మరికొందర్ని ప్రశ్నించింది.. ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటూ గజ్జల ఉదయ్ కుమార్ను సీబీఐ అరెస్ట్ చేసింది. వారిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. ఇటు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పైనా సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో.. జూన్ నెలలో విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేసింది.. సీబీఐ దర్యాప్తును కొనసాగించొచ్చని తెలిపింది. అంతేకాదు సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు దర్యాప్తు గడువును జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa