రాష్ట్రంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా రూ. 92. 58 లక్షలతో విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్మించిన ప్రకాశం పంతులు మహిళా పార్కు ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఆధునిక వసతులు, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు తదితర సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన పార్కును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్. కె. రోజా లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఎస్, విజయనగరం కార్పొరేషన్ పాలక వర్గ ప్రతినిధులు భాగస్వామ్యమయ్యారు.
మహిళా పార్కు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియం నుంచి నిర్వహించిన ర్యాలీ విజయవంతంగా సాగింది. మంత్రి ఆర్. కె. రోజా, డిప్యూటీ స్పీకర్, జడ్పీ ఛైర్మన్, ఎంపీ ఇతర ప్రముఖులు ముందు నడవగా వేలాది మంది మహిళలు వెనుక ర్యాలీగా సాగారు. సాంస్కతిక వైభవాన్ని చాటుతూ నిర్వహించిన ప్రదర్శనలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ బృందాలు ప్రత్యేక వాయిద్యాలు, గరగ నృత్యాలు, థింసా నృత్యాలతో చూపరులను ఆనందింపజేశారు.
ఆనంద గజపతి ఆడిటోరియం నుంచి ప్రారంభమైన ర్యాలీ సింహాచలం మేడ, కోట జంక్షన్, మూడు లాంతర్లు జంక్షన్, గంట స్తంభం కూడలి మీదుగా ప్రకాశం పంతులు మహిళా పార్కు వరకు కోలాహలంగా సాగింది. అనంతరం అక్కడ రిబ్బన్ కత్తిరించి మంత్రి ఆర్. కె. రోజా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ, డిప్యూటీ స్పీకర్, జడ్పీ ఛైర్మన్, ఎంపీలతో కలిసి పార్కును ప్రారంభించారు. అనంతరం ఓపెన్ జిమ్, స్విమ్మింగ్ పూల్, పిల్లల ఆట పరికరాలను, హోం థియేటర్లను పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa