ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై పలు రాష్ట్రాలు తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్దతు లభిస్తోంది. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయింపు నిస్తున్నట్టు ప్రకటించింది.‘‘ది కేరళ స్టోరీ సినిమాపై ఉత్తరప్రదేశ్లో పన్ను రహితం చేస్తున్నాం’’ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ సహా ఆయన క్యాబినెట్ మంత్రుల కోసం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
ఇప్పటికే ఈ వివాదాస్పద చిత్రానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. దీంతో పన్ను రహితంగా ప్రకటించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ చిత్రానికి పన్ను రహితంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు డెహ్రాడూన్లోని పీవీఆర్ మల్టీప్లెక్స్లో ఆయన సినిమాను చూసే అవకాశం ఉంది. ఆయనతో పాటు క్యాబినెట్ మంత్రి గణేష్ జోషి కూడా పాల్గొననున్నారు.
మరోవైపు, సినిమా విడుదలను ఆపేయాలని పలువురు కేరళ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా... స్టే విధించేందుకు నిరాకరించింది. ట్రైలర్లో ఏ ఒక్క వర్గానికి అభ్యంతరకరమైన అంశాలు లేవని పేర్కొంది. సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్రంలోని వివిధ యువజన సంఘాలు ప్రదర్శనలు నిర్వహించాయి. తమిళనాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లు ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని పేర్కొంటూ మే 7 నుంచి కేరళ స్టోరీ ప్రదర్శనను నిలిపివేశాయి. బెంగాల్ ప్రభుత్వం కూడా ఈ సినిమాను నిషేధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa