ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 04:10 PM

 ‘‘బోయ వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చే అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలి. మా గిరిజనుల ఆత్మాభిమానంపై దెబ్బకొట్టిన వైసీపీ నాయకులు.. దయచేసి మా గ్రామానికి రావొద్దు’’ అంటూ శ్రీకాకుళం జిల్లా, మందస మండలం చీపి పంచాయతీలో ఆదివాసీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం మందస మండలం చీపి పంచాయతీలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకుని.. వైసీపీ నాయకుల రాకను వ్యతిరేకిస్తూ ఆదివాసీ వికాసపరిషత్‌, గిరిజన సంఘం నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బోయవాల్మీకులను ఎస్టీల్లో చేర్చడంపై నిరసనగా తమ గ్రామాలకు రావొద్దంటూ ఫ్లెక్సీలో స్పష్టం చేశారు. చీపి, బొందికారి గ్రామాల్లో రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై మంత్రి వచ్చే సమయానికి ఫ్లెక్సీలను తొలగించి ముళ్లపొదల్లో పడేశారు. మంత్రి అప్పలరాజు చీపి, బొందికారి గ్రామాల్లో పర్యటించగా.. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో పదినిమిషాల్లో వెనుదిరిగారు. బొందికారి గ్రామంలో పలు సమస్యలపై యువత మంత్రి సీదిరి అప్పలరాజును నిలదీశారు. తమ గ్రామానికి రహదారి, పాఠశాలకు గేటు, తాగునీటి వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బోయవాల్మీకులను ఎస్టీలో చేర్చేందుకు చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం సొండిపూడిలో సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.


- చీపి పంచాయతీలో వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. బోయవాల్మీకులను ఎస్టీలో చేర్చేందుకు అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ.. కొంతకాలంగా గిరిజనులు నిరసన బాటపట్టారు. నెలరోజులుగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ నిరసన గ్రామాల నుంచి నేడు వైసీపీ నాయకుల వరకు పాకింది. ఇప్పటికే రెండు పంచాయతీల వార్డుమెంబర్లు రాజీనామాలు చేశారు. రానున్న కాలంలో ఈ నిరసనలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఎంపీపీ డొక్కర దానయ్య, అగ్తున్న సూర్యారావు, ఎంపీడీవో తిరుమలరావు, తహసీల్దార్‌ బి.పాపారావు, పలువురు అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa