తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి...’ కార్యక్రమంలో భాగంగా బుధవారం పెందుర్తి, 18న ఎస్.కోట, 19న అనకాపల్లి నియోజక వర్గాల్లో రోడ్షోలు, బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు.
చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నం 2.40 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి 3.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు పెందుర్తి సమీపంలో గల మహిళా ప్రగతి కేంద్రం వద్దకు చేరుకుని పంచ గ్రామాల సమస్యపై వినతిపత్రాలు స్వీకరిస్తారు. అనంతరం అక్కడ నుంచి పెందుర్తి జంక్షన్ వరకూ రోడ్షో నిర్వహిస్తారు. ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకూ పెందుర్తి జంక్షన్ నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. సభ అనంతరం వేపగుంటలోని మీనాక్షి కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. ముందుగా సరిపల్లిలో చంద్రబాబు బసకు ఏర్పాట్లుచేశారు. అయితే ఎండ ఎక్కువగా వుండడంతో మీనాక్షి కన్వెన్షన్ సెంటర్కు మార్చారు. గురువారం ఉదయం పది గంటలకు స్థానిక టీడీపీ నేతలతో సెల్ఫీ విత్ చంద్రబాబు కార్యక్రమం ఉంటుంది. అనంతరం మత్స్యకారులతో సమావేశమవుతారు. ఆ తరువాత నియోజకవర్గ సమస్యలపై నేతలతో మాట్లాడతారు. ముదపాకలో ల్యాండ్పూలింగ్లో అధికార పార్టీ నేతల వల్ల రైతులకు జరిగిన అన్యాయం, పరవాడలో కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామం తరలింపు, సింహాచలం దేవస్థాన పరిధి పంచగ్రామాల భూసమస్యను అధినేత దృష్టికి తీసుకువెళ్లాలని నేతలు భావిస్తున్నారు. తదుపరి టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులతో సమీక్షిస్తారు. భోజనం అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు ఎస్.కోట బయలుదేరతారు. అక్కడ రోడ్షో, అనంతరం బహిరంగ సభల్లో పాల్గొన్న అనంతరం ఆరోజు రాత్రి సింకి రిసార్ట్స్లో బస చేస్తారు. 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సింకి రిసార్ట్స్ నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు అనకాపల్లి సమీపంలోని శంకరం జంక్షన్కు చేరుకుంటారు. అక్కడ నల్లబెల్లం రైతుల నుంచి వినతిపత్రం స్వీకరిస్తారు. అనంతరం రోడ్షో నిర్వహిస్తారు. నాలుగురోడ్ల కూడలి మీదుగా 6.30 గంటలకు నెహ్రూచౌక్కు చేరుకుని అక్కడ ఏర్పాటుచేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి తొమ్మిది గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకుని హైదరాబాద్ వెళతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa