ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప‌నులు అడ్డుకుంటే మ‌త్స్య‌కారుల‌కే న‌ష్టం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2023, 10:59 AM

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో రూ. 152 కోట్లతో విశాఖపట్నం పోర్టు చేపట్టిన పనులను అడ్డుకోవడం వల్ల మత్స్యకారులకే నష్టమని, సమస్యలపై కాకుండా వేరే ఆలోచనలతో కొందరు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తప్పవని కలెక్టర్‌ మల్లికార్జున హెచ్చరించారు. ఫిషింగ్‌ హార్బర్‌ డీపీఆర్‌ మార్చాలంటూ ఇటీవల చాలామంది ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఆయన శనివారం కలెక్టరేట్‌లో విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌, పోర్టు, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఆర్‌లో ఏమున్నాయో వివరించారు. అవన్నీ మత్స్యకారులకు ఉపయోగపడే పనులేనని, వాటిని ఆపితే నష్టం జరుగుతుందే తప్ప ప్రయోజనం లేదన్నారు. సుమారు పది బోట్లు మునిగిపోయాయని, వాటిని వెలికి తీయాలని సంఘాల నాయకులు కోరగా, పోర్టు సాయంతో, యజమానుల సమక్షంలో వాటిని వెలికి తీయిస్తామని హామీ ఇచ్చారు. పరర్మనెంట్‌గా ఇందు కోసం ఒక క్రేన్‌ను హార్బర్‌లో ఉంచాలని మత్స్యకార నాయకులు డిమాండ్‌ చేయగా దానికి పోర్టు అధికారులు నిరాకరించారు. అది సాధ్యం కాదని, జెట్టీలో బోట్లను సక్రమంగా నిలుపుకోవలసిన బాధ్యత యజమానులపై ఉందన్నారు. చేపల వేలం పాటల కోసం అదనంగా మరో హాలు నిర్మించాలని కోరగా, అన్నీ పరిశీలించి అవసరమైన మేరకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. డీపీఆర్‌లో ప్రతిపాదించిన ఫ్లోటింగ్‌ జెట్టీలకు బదులుగా పర్మనెంట్‌ జెట్టీలను నిర్మించాలని కోరగా, దానికి అదనంగా రూ. 1. 6 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. బోట్లను రిపేర్లు చేసుకోవడానికి కొత్తగా మరో బీచింగ్‌ పాయింట్‌ ఏర్పాటుచేయాలని కోరగా, కొత్తది వీలు కాదని, పాత దానినే అభివృద్ధి చేసి ఇస్తామని స్పష్టంచేశారు. ఎండుచేపల వ్యాపారం చేసుకునే వారికి యార్డు కావాలని కోరగా, తిమ్మాపురంలో ఇప్పటికే యార్డులు ఉన్నాయని, వాటి కేటాయింపు పూర్తయిన తరువాత ఇంకా అవసరమైతే అప్పుడు చూస్తామన్నారు. దొంగతనాలు జరగకుండా నివారించేందుకు హార్బరులో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు అంగీకరించారు. అలాగే హార్బర్‌లో మురుగునీటి కోసం ఎఫులియెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పోర్టు చీఫ్‌ ఇంజనీర్‌, హార్బర్‌ ఏసీపీ, సీఫుడ్‌ ఎగుమతిదారుల అసోసియేషన్‌ అధ్యక్షులు పద్మనాభం, ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్‌, మత్స్య శాఖ జేడీ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa