వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు ఎలాంటి సహకారం అందడం లేదని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా దేవగుడి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో లోకేష్ ముఖాముఖి సమావేశంలో నిర్వహించారు.ఈ సందర్భంగా టెక్స్టైల్ పార్క్లో కంపెనీలు రాక ఉపాధి అవకాశాలు రావడం లేదని చేనేత కార్మికులు లోకేష్కు విన్నవించారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు బీమా పథకాన్ని రద్దు చేశారని పేర్కొన్నారు. నేత కార్మికులు చివరికి, ఇళ్లు కూడా లేక ఇబ్బంది పడుతున్నారని.. షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని పేర్కొన్నారు. అలాగే, విద్యుత్ సరఫరాలో ఓల్టేజీ కారణంగా ఇబ్బంది పడుతున్నామని వివరించారు. దీని వల్ల తమ ఉత్పత్తులకు నాణ్యత తగ్గిపోతోందన్నారు. అలాగే, అన్ సీజన్లో ఉపాధి ఉండటం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని సమస్యలు ఏకరువు పెట్టారు.
అనంతరం చేనేత కార్మికుల సమస్యలపై లోకేశ్ మాట్లాడుతూ.. వారికి పలు హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత తల్లి, చెల్లినే రోడ్డు మీదకు గెంటేశారని.. తల్లి లాంటి వైఎస్సార్ జిల్లాకు కూడా అన్యాయం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో చేనేత కార్మికులు కూడా బాధితులే అని అన్నారు. కనీసం చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సమీక్ష చేసే తీరిక కూడా జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలను దత్తత తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత రంగంపై ఉన్న 5 శాతం జీఎస్టీ భారం పడకుండా చేస్తామన్నారు. చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు, కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ ప్రవేశ పెడతామని చెప్పారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మగ్గాల సంఖ్య తగ్గిపోయిందని లోకేష్ ఫైరయ్యారు. ప్రభుత్వం నుంచి సాయం లేక చేనేత కార్మికులు ఇతర రంగాలకు వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఆధారపడ్డ రైతులు, రంగులు అద్దే కార్మికుల దగ్గర నుంచి మాస్టర్ వీవర్స్ వరకు అందరినీ ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa