చైనా మరో భారీ ప్రయత్నానికి అంకురార్పణ చేసింది. భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వుతోంది. భూమి లోపల 32,808 ఫీట్ల లోతు వరకు (10,000 మీటర్లు) ఈ రంధ్రాన్ని తవ్వనున్నారు. అంటే, భూమి లోపల 10 కిలోమీటర్ల లోతు వరకూ ఈ తవ్వకాలు కొనసాగుతాయన్నమాట. ఇందు కోసం చైనా అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా మన దగ్గర తాగు, సాగు నీటి కోసం వేసే బోర్లను 100 నుంచి 350 ఫీట్ల వరకు తవ్విస్తారు. కొన్ని జిల్లాలో 500, 600 ఫీట్ల వరకూ బోర్లు వేస్తారు. ఇలాంటి బోరుబావులతో పోలిస్తే.. చైనా తవ్వుతున్న రంధ్రం ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఇంత భారీ బోర్వెల్ పనులను చైనా శాస్త్రవేత్తలు మంగళవారం (మే 30) ప్రారంభించారు. షింజియాంగ్ ప్రాంతంలోని అత్యంత కీలకమైన, వ్యూహాత్మకైన ప్రాంతంలో ఈ తవ్వకాన్ని మొదలుపెట్టారు. కరోనా వైరస్ పుట్టిన గడ్డపై మళ్లీ ఏం పరిశోధనలు జరుగుతున్నాయని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఇంత లోతైన రంధ్రాన్ని చైనా ఎందుకు తవ్వుతోంది? దీని వల్ల ప్రయోజనం ఏంటి? భవిష్యత్తులో ఎలాంటి పరిశోధనలకు ఆస్కారం ఉంది?
ఇప్పటివరకూ ప్రపంచంలోనే మానవులు తవ్విన అత్యంత లోతైన రంధ్రం రష్యాలో ఉంది. దీన్ని ‘కోలా సూపర్ డీప్ బోర్ హోల్’గా పేర్కొంటారు. దీని లోతు 12,262 మీటర్లు (దాదాపు 40 వేల ఫీట్ల లోతు). ఈ బోర్ను 20 ఏళ్ల పాటు వేయగా.. 1989లో 12,262 మీటర్ల లోతుకు అది చేరుకొంది. ప్రస్తుతం చైనా చేపట్టిన తవ్వకాలు భూమి అడుగున దాదాపు 10 రాతి పొరలను చీల్చుకొంటూ కొనసాగనున్నాయి. ఇందులో అత్యంత సంక్లిష్టమైన దశలు కూడా ఉన్నాయి. భూమి లోపల క్రెటెషియస్ పొర వరకూ ఈ తవ్వకాలను చేపట్టనున్నారు. ఈ పొర వయస్సు దాదాపు 145 మిలియన్ సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తవ్వకాలు ఎంత కాలం కొనసాగుతాయనేది మాత్రం తెలియాల్సి ఉంది.
భూమి లోపల ఎలాంటి ఖనిజ సంపద, ఇంధన వనరులు ఉన్నాయో తెలుసుకునేందుకు చైనా ఈ భారీ తవ్వకాలను చేపట్టింది. దీంతో పాటు భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం ముప్పును ముందే పసిగట్టగలిగే నూతన మార్గాల అన్వేషణకు ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని చైనా భావిస్తోంది. ఈ డ్రిల్లింగ్ ప్రాజెక్టు అత్యంత కఠినమైందని చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్త సున్ జింషెంగ్ అన్నారు. ఓ భారీ ట్రక్కును రెండు సన్నటి తీగలపై నడిపించినట్లు ఇది ఉంటుందని ఆయన అభివర్ణించారు. ఇదే సమయంలో చైనా మరో కీలక ప్రయోగం చేపట్టింది. ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి విజయవంతంగా పంపించింది. భూమికి 400 కి.మీ. ఎత్తులో ఉన్న చైనా అంతరిక్ష కేంద్రంలోకి వీరు ప్రవేశించారు. ఈ ముగ్గురిలో చైనా తొలి పౌర వ్యోమగామి గుయ్ హైచావో కూడా ఉన్నారు. లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా రోదసిలోకి పంపించిన షెంజౌ-16 వ్యోమనౌకలో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి పయనమయ్యారు. చైనా అంతరిక్ష కార్యక్రమంలో ఇదొక కీలక ముందడుగు. భూమి లోపలా, అంతరిక్షంలో.. ఒకేసారి రెండు పరిశోధనలను ప్రారంభించడం ద్వారా చైనా మరొక్కసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa