కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు ఏకమై బీజేపీని ఓడిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... ‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు బాగుంటుందని నేను భావిస్తున్నాను.. ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తుందని నేను అనుకుంటున్నాను.. కేవలం లెక్కలు మాత్రమే కాదు.. ప్రతిపక్షాలు ఏకమై బీజేపీని సొంతంగా ఓడిస్తాయి’ అని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఏడాదిలోపే లోక్సభ ఎన్నికలు జరగనున్నాయని, కూటమి ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోందని అన్నారు.
‘ప్రతిపక్షాలు మధ్య ఐక్యత కుదురుతోంది... మేము అన్ని ప్రతిపక్షాలతో (పార్టీలు) చర్చలు జరుపుతున్నాం.. ఈ విషయంలో పురోగతి ఉందని నేను భావిస్తున్నాను.. ప్రతిపక్షాల మధ్య పోటీ, అంతరం ఉన్నందున ఇది సంక్లిష్టమైన చర్చ. కాబట్టి కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరం.. కానీ అది (ప్రతిపక్ష కూటమి) జరుగుతుందని నాకు నమ్మకం ఉంది’ అని తెలిపారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. దర్యాప్తు సంస్థలను చేతుల్లో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
అలాగే పరువు నష్టం కేసులో దోషిగా తేలి పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవడంపై కూడా రాహుల్ మాట్లాడారు. దాని వల్ల తనకు మంచే జరిగిందని వ్యాఖ్యానించారు. తనపై అనర్హత వేటు వేస్తారని ఎన్నడూ ఊహించలేదని, ఇలా కూడా చేస్తారని తాను అస్సలు అనుకోలేదని చెప్పారు. కానీ, తన దీని వల్ల మంచే జరిగిందని.. ప్రజలకు మరింత సేవ చేసే అతిపెద్ద అవకాశం లభించిందని తెలిపారు.
‘ఇది నన్ను నేను పూర్తిగా పునర్నిర్వచించుకోవడానికి అవకాశం ఇచ్చింది.. నిజంగా వారు నాకు ఒక బహుమతి ఇచ్చారని నేను అనుకుంటున్నాను.. వారు దానిని గ్రహించలేదు కానీ అదే నిజం’ అని చెప్పారు. తనను హత్య చేస్తామన్న బెదిరింపుల గురించి ఆందోళన చెందడం లేదని, వెనక్కి తగ్గడానికి అది కారణం కాదన్నారు. ‘హత్య బెదిరింపుల గురించి నేను ఆందోళన చెందను.. అందరూ చనిపోవాల్సిందే... అది నేను మా నాన్నమ్మ, నాన్న నుంచి నేర్చుకున్నాను.. అలాంటి వాటి వల్ల మీరు వెనక్కి తగ్గొద్దు’ అని మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అంగరక్షకులు చేతిలోనే హత్యకు గురికాగా.. 1991లో రాజీవ్ గాంధీని ఆత్మాహుతి దాడిచేసి హత్యచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa