ముంబయి విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. బ్యాగేజీ పరిమితికి మించడంతో అదనపు రుసుం చెల్లించమని సిబ్బంది కోరడంతో తన బ్యాగులో బాంబు ఉందని గోలగోల చేసింది. దీంతో ఆమెను విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించారు. బ్యాగును పరిశీలించగా ఎటువంటి అనుమానిత పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. సదరు మహిళను కోర్టులో హాజరుపరచగా.. బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ముంబయికి చెందిన ఓ మహిళ.. మే 29న కోల్కతా వెళ్లేందుకు స్పైస్జెట్ టిక్కెట్ బుక్ చేసుకుంది.
కోల్కతాలోని తన తల్లిని చూడటానికి వెళ్తూ.. మే 29న సాయంత్రం ముంబయి విమానాశ్రయానికి చేరుకుంది. బ్యాగేజ్ కౌంటర్ వద్దకు వెళ్లి.. తన లగేజీని అప్పగించింది. అయితే, నిబంధనల ప్రకారం.. దేశీయ విమానాలలో 15 కిలోల వరకూ అనుమతిస్తాయి. ఈ పరిమితిని మించితే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె వెంట తెచ్చుకున్న లగేజీ 22 కిలోలపైనే ఉండటంతో ఈ విషయం ఆమెకు సిబ్బంది వివరించి, కొంత చెల్లించాలని కోరారు. కానీ, అందుకు నిరాకరించిన ఆమె.. తన బ్యాగులో బాంబు ఉందని భయపెట్టింది.
ఆమె మాటలకు బెదరిపోయిన సిబ్బంది.. వెంటనే సీఐఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తం చేశారు. దీంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించడంతో కోర్టులో హాజరుపరిచారు. ‘ఆమె అరవడం ప్రారంభించింది.. చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఎగ్జిక్యూటివ్తో గొడవ పడింది.. నేను ఆమెను శాంతించమని చెప్పాను.. ఆమెకు ఎయిర్లైన్ నియమాలను వివరించడానికి ప్రయత్నించాను. కానీ ఆమె వినిపించుకోలేదు.. నాతో వాదులాట ప్రారంభించింది.. మరాఠీ మాట్లాడని వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. అప్పటికి సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ముత్తుకుమార్ చెక్ ఇన్ కౌంటర్ వద్దకు వచ్చారు. ఏమి జరిగిందో సిబ్బంది వివరించారు.. తమ పై అధికారికి ఫోన్లో కూడా తెలియజేశారు’ అని విమానాశ్రయ ఎగ్జిక్యూటివ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు.
ఇన్స్పెక్టర్ కుమార్ వచ్చి ఆమెతో మాట్లాడుతుంటే అకస్మాత్తుగా నా వద్ద బాంబు ఉంది అని చెప్పింది. దీంతో ముప్పుగా భావించిన అధికారులు డాగ్ స్క్వాడ్ను పిలిచారు. అయితే స్నిఫర్ డాగ్స్కి ఆమె బ్యాగ్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇదే సమయంలో 100కి సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకున్నారు. ఆమెపై కేసు నమోదుచేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. మర్నాడు ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల చేశారు. అయితే, ఆమె వివరాలను మాత్రం పోలీసులు బయటపెట్టలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa