వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన వైసీపీ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయన్నారు. రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని చెప్పారు. అందుకే వేరే రాజకీయ పార్టీలపై ఆధారపడుతున్నారని ఎద్దేవా చేశారు. వేరే పార్టీల అండ కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి తానేమీ మాట్లాడనని వ్యాఖ్యానించారు.
మరోవైపు, పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏటీబీ మిషన్ లాంఛ్ చేశారు. ఏటీబీ మిషన్లో రూ. 10 నాణెం వేస్తే బ్యాగ్ వచ్చేలా ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహా అన్ని దేవాలయాల్లో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం తగ్గించామన్నారు. సముద్ర, నదీ తీరాల్లో, చెరువులు, కాల్వల్లో క్లీనింగ్ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు.
కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొ్న్నారు. రూ. 13 లక్షల కోట్ల ఎంఓయూల్లో మెజారిటీ ఎంఓయూలు కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి సంబంధించే వచ్చాయని చెప్పారు. 160 అర్బన్ ప్రాంతాల్లో నగర వనాలు ఏర్పాటు చేశామన్నారు. అడవుల విస్తీర్ణానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa