మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతి కొనసాగుతోంది. ఆయన చనిపోవడానికి ముందు రాసిన లేఖపై వేలిముద్రలను గుర్తించడం కోసం నిన్హైడ్రిన్ అనే ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టు అనుమతినిచ్చింది. నిన్హైడ్రిన్ పరీక్ష కోసం లేఖను ఢిల్లీలోని సీఎఫ్ఎస్ఎల్కు పంపించేందుకు సీబీఐకి న్యాయస్థానం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒరిజినల్ లేఖను కోర్టుకు సమర్పించి.. అవసరమైనన్ని సర్టిఫైడ్ కాపీలు తీసి పెట్టుకోవాలని సీబీఐకి కోర్టు సూచించింది. నిన్ హైడ్రిన్ పరీక్షలో ఒకవేళ ఒరిజినల్ లేఖ దెబ్బతిన్నట్లయితే సర్టిఫైడ్ కాపీని సాక్ష్యంగా సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
ఇదిలావుంటే తనను డ్రైవర్ ప్రసాద్ హత్య చేసినట్లు వివేకానందరెడ్డి పేరుతో రాసిన లేఖ హత్యా స్థలంలో ఆరోజున లేఖ లభించింది. ఆ లేఖను కడప కోర్టు ద్వారా సీబీఐ 2021లో తీసుకుంది. ఈ లేఖను 2021 ఫిబ్రవరి 11న ఢిల్లీలోని సీఎఫ్ఎస్ఎల్కు సీబీఐ పంపించింది. ఈ క్రమంలో ఆ లేఖ వివేకానందరెడ్డి రాసిందేనా? ఆయన దీన్ని ఒత్తిడిలో రాశారా? అని విశ్లేషించి నివేదిక ఇవ్వాలని కోరింది.
గతంలో వివేకానందరెడ్డి రాసిన ఇతర పత్రాలతో పోల్చిన సీఎఫ్ఎస్ఎల్ .. అది వివేకా రాసిందేనని, అయితే తీవ్ర ఒత్తిడిలో రాసినట్లు తేల్చి సీబీఐకి నివేదిక ఇచ్చింది. ఆ లేఖను బలవంతంగా రాయించినట్లు అప్రూవర్ దస్తగిరి తెలపడంతో.. దానిపై వేలిముద్రలు గుర్తించి ముద్రించాలని సీఎఫ్ఎస్ఎల్ను సీబీఐ కోరింది.
ఇక, లేఖపై వేలిముద్రలు గుర్తించాలంటే నిన్ హైడ్రిన్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు సీబీఐకి తెలిపారు. అయితే నిన్హైడ్రిన్ పరీక్ష వల్ల లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుందని పేర్కొంది. వివేకా హత్య కేసులో ఈ లేఖ కీలక ఆధారంగా ఉన్నందున సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. నిన్హైడ్రిన్ పరీక్షకు అనుమతివ్వాలని.. ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్ను రికార్డుల్లో ఉంచాలని కోర్టును సీబీఐ కోరింది.
ఈ లేఖపై అనుమానితుల వేలిముద్రలను పోల్చాల్సి ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే, సీబీఐ అభ్యర్థనపై నిందితులు అభ్యంతరం తెలిపారు. సీబీఐ పిటిషన్ చట్టసమ్మతం కాదని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇటీవల ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. బుధవారం తీర్పు వెల్లడించింది. ఆ లేఖను పరీక్షలకు పంపించేందుకు అనుమతి ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa