కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామ జోగయ్యపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆయన తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా మందలించింది. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసేందుకు యత్నించారని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది.
ఈ మేరకు సోమవారం పిటిషనర్ హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది వాదనలకు సిద్ధం కాగా.. ఆ వెంటనే బెంచ్ కలగజేసుకుంది. ఇదొక పబ్లిక్ న్యూసెన్స్ అని.. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందని ప్రశ్నించింది. వ్యక్తిగత కక్షతోనే పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఓ మాజీ ఎంపీ అయ్యి ఉండి ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తుల కేసులకు సంబంధించిన విచారణను త్వరగా పూర్తి చేసేలా చూడాలని హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతికి లేఖ రాశామని.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం.. అని అంటారా! ఇది ఏం పద్ధతి అని హైకోర్టు ప్రశ్నించింది. ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడి పనిచేయవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికింది. ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని తప్పుబట్టింది.
మీరు దాఖలు చేసిన పిటిషన్లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉందని మీకైనా అనిపిస్తోందా అని హరిరామ జోగయ్యను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. వ్యక్తిగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి.. తమ విలువైన సమయాన్ని వృథా చేయొద్దని హితవుపలికింది. ఈ మధ్య తెలంగాణ గవర్నర్ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ కేసులు ఎక్కువయ్యాయని తెలిపింది. కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేమని హైకోర్టు ధర్మాసనం పిటిషనర్కు స్పష్టం చేసింది.
ఇదిలావుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసుల్ని త్వరగతిన విచారణ పూర్తి చేయాలని, 2024 సాధారణ ఎన్నికలకు ముందే తీర్పు వెలువరించాలని, ఆ మేరకు సీబీఐ కోర్టును ఆదేశించాలని హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, ఈ పిల్పై అభ్యంతరం లేవనెత్తిన రిజిస్ట్రీ.. కేసు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఫైలింగ్ నంబర్పైనే విచారణ మొదలైంది. రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తిన అంశాల కాపీని పిటిషనర్కు ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను జూలై 6కి వాయిదా వేసింది ధర్మాసనం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa