ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో సింగిల్ క్యూ లైన్ పద్దతి అమలు,,,ఈ విధానంతో టీటీడీ ప్రయోగం విజయవంతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 12, 2023, 10:04 PM

ఎండాకాలం వస్తే చాలు తిరుమలకు భక్తులు క్యూ కడతారు. వేసవికాలంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులతో పాటూ పరీక్షల ఫలితాలు వస్తాయి.. దీంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు కొండకు వస్తుంటారు. మార్చి నెలాఖరు నుంచి జులై రెండో వారం వరకు ఈ రద్దీ కొనసాగుతూ ఉంటుంది. టీటీడీ కూడా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది.


రెండు, మూడు వారాలుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ వీకెండ్, రద్దీ సమయాల్లో సిఫార్సు లేఖల్ని స్వీకరించడం లేదు. అలాగే రద్దీ లేకుండా భక్తులు త్వరగా స్వామిని దర్శించుకునేందుకు టీటీడీ సరికొత్త ప్రయోగం చేసి సఫలమైంది. తిరుమల ఆలయం వెండి వాకిలి నుంచి సింగిల్ క్యూలైన్ విధానం పాటించడం ద్వారా.. ఎక్కువమంది భక్తులు సులభంగా స్వామివారిని దర్శించుకున్నారు.


ఈ సరికొత్త విధానం వల్ల ఆదివారం రోజు రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీకెండ్, అందులోనూ ఆదివారం కావడం, అలాగే వేసవి సెలవులు ముగియనుండటంతో తిరుమలలో కిలోమీటర్లమేర భక్తులు క్యూ లైన్‌లలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. అందుకే టీటీడీ సింగిల్ క్యూ లైన్ విధానాన్ని అమలు చేసి సక్సెస్ అయ్యింది. గత నాలుగేళ్లలో ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తలే అత్యధికం కావడం విశేషం.


ఆదివారం నాడు ఏకంగా 92,238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే సర్వదర్శనం క్యూలైన్ ద్వారానే 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్ మార్పులపై ఈవో ధర్మారెడ్డి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. భక్తుల రద్దీకి తగినట్లుగా ఇలా కొన్ని ప్రయోగాలు చేసి సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ భావిస్తోంది. ఆ దిశగానే టీటీడీ ఏర్పాట్లు కూడా చేస్తోంది.


ఇదిలా ఉంటే ఆదివారం తిరుమల శ్రీవారిని ఆదివారం రోజు 92,238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. వీరిలో 40వేల 400 మంది తలనీలాలు సమర్పించారు. ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు రాగా.. సోమవారం కూడా రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. మొత్తం మీద టీటీడీ సామాన్య భక్తుల కోసం సరికొత్త ప్రయోగాలను చేపడుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa