కర్నూలు జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ మాజీ జెడ్పీటీసీ కప్పట్రాళ్ల బొజ్జమ్మ (సుశీలమ్మ) దంపతులు వైఎస్సార్సీపీకి జై కొట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుశీలమ్మ.. ఆమె భర్త, దేవనకొండ మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ వారందరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, కడప జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
టీడీపీ కోసమే తమ కుటుంబం బలైందని.. అయినా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు బొజ్జమ్మ. తన తండ్రి స్థానంలో తాను టీడీపీకి పనిచేశానని.. తన తండ్రిని చంపించిన వారిని చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారన్నారు. గుర్తించని పార్టీలో ఉండటం అనవసరం అనిపించిందన్నారు. అందుకే తాము వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు.
చంద్రబాబు బీసీల పార్టీ అంటూనే.. బీసీలకు ఏం న్యాయం చేయలేదన్నారు. సీఎం జగన్ బీసీలకు చేస్తున్న మేలుతో తాము వైఎస్సార్సీపీలో చేరామన్నారు. సీఎం తమకు రక్షణ కల్పిస్తారన్న నమ్మకం ఉందని.. చంద్రబాబు మోసం చేశారని.. సీఎం జగన్ బీసీలకు అనేక పదవులు ఇచ్చారన్నారు. ప్రజలకు మంచి సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు.
కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ కనుమరుగు అయ్యిందన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. 40 ఏళ్లుగా టీడీపీలో ఉండి ఎన్నో నష్టాలు, కష్టాలు ఎదుర్కొన్నారని.. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. బొజ్జమ్మ, రామచంద్ర నాయుడు వైఎస్సార్సీపీ చేరారన్నారు. బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని.. 2024లో కూడా జగన్ను మళ్లీ సీఎంగా చేసుకుంటాము అన్నారు. కప్పట్రాళ్ల ఫ్యామిలీ మొదటి నుంచి టీడీపీలో ఉంది.. వెంకటప్పనాయుడు మరణం తర్వాత ఆమె కుమార్తె బొజ్జమ్మ పార్టీలో కొనసాగారు. ఇప్పుడు ఆమె వైఎస్సార్సీపీలో చేరడం ఆలూరు నియోజకవర్గంలో టీడీపీకి నష్టమనే చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa