ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముద్రగడ్డ వర్సెస్ హరిరామ జోగయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 05:50 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేయగా.. కౌంటర్‌గా ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ క్రమంలో ముద్రగడకు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య లేఖతో మరో కౌంటర్ ఇచ్చారు. పద్మనాభం ఇప్పటివరకు పెద్దమనిషి అనుకున్నానని.. పవన్ కళ్యాణ్‌పై ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో తన నమ్మకానికి తూట్లు పొడిచిందన్నారు. చిన్న మంత్రి పదవులు ఆశించి.. రెడ్డి కులాధిపతికి కాపులను తాకట్టు పెట్టాలని చూస్తున్న నాయకులను చూసి మోసపోవద్దన్నారు.


జనసేనకు ఓట్లు పడకుండా.. తెర వెనుక వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికింది ముద్రగడ కాదా అంటూ ఘాటుగా స్పందించారు. లక్షలాదిమంది కాపులు లక్ష్యానికి చేరువవుతున్న సమయంలో.. దానిని చెడగొట్టేందుకు ఈ ప్రయత్నం వెనుక సీఎం వైఎస్‌ జగన్ హస్తం లేదా అని ప్రశ్నించారు. కాకినాడలో పోటీ చేసి పవన్‌‌ను గెలవమని సవాల్‌ చేసిన ముద్రగడ.. తన సొంత నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా, లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ తరుఫున గానీ గెలవగలరా అని ప్రశ్నించారు. నోరుమూసుకుని కూర్చో అంటూ హెచ్చరించారు.


ముద్రగడ పద్మనాభం గతంలో కాపులకు రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో ఉద్యమం చేశారని తాను నమ్మానన్నారు. 2019 ఎన్నికల ముందు కాపులకు రిజర్వేషన్స్‌ తన పరిధిలో లేదంటూ జగన్ చేసిన ప్రకటనను ఖండిస్తూ వైఎస్సార్‌‌సీపీని ఎన్నికలలో వ్యతిరేకించండి అంటూ ఎందుకు ప్రకటించలేదో ముద్రగడ చెప్పాలన్నారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చి.. తెలుగు దేశంను వ్యతిరేకిస్తున్నట్లు నటించి.. జనసేన పార్టీకి ఓట్లు పడకుండా చేసింది ఆయన కాదా అన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని గంగలో కలిపి మధ్యలో రాజీనామా చేసి.. కాపులకు అన్యాయం చేసింది పద్మనాభం కాదా అన్నారు.


కాపులు ఎప్పటి నుంచో రాజ్యాధికారాన్ని కోరుతున్న మాట వాస్తవం అన్నారు హరిరామజోగయ్య. అందుకే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం పోరాడుతూ విజయం వైపు దూసుకెళుతున్నారన్నారు. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేసి రాజ్యాధికారం కోరుకుంటున్న లక్షలాది కాపు కులస్తుల లక్ష్యాన్ని చెడగొట్టటానికి చేస్తున్న ప్రయత్నం వెనుక కాపు వ్యతిరేకి జగన్ హస్తం లేదా అని ప్రశ్నించారు. కాపులకు రాజ్యాధికారం కోసం పద్మనాభం.. వైఎస్సార్‌సీపీ తరపున కాపు కులుస్తుడ్ని ముఖ్యమంత్రిగా పోటీలోకి దించడానికి ఒప్పించగల దమ్ముందా అని సవాల్ చేశారు.


కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాడీయిజం, బ్లాక్‌ మెయిలింగ్‌, అక్రమ వ్యాపారాలు, స్మగ్లింగ్‌లపై పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ బహిరంగ నభలో ప్రస్తావించడంపై ముద్రగడ ప్రశ్నించాల్సిన పనిలేదన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలన చేపట్టాలంటే 175 నియోజకవర్గాల్లో పోటీ పెట్టగల సత్తా ఉండి.. మెజార్టీ సంపాదించాల్సిన పనిలేదన్నారు. కింగ్ మేకర్ అవ్వగల సీట్లు గెలిచినా రాష్ట్ర పరిపాలన చేపట్టవచ్చనే ఇంగిత జ్ఞానం కొంతైనా ఉండాలన్నారు. ఈయన రాజకీయం ఎలా చేస్తున్నారో అర్ధంకావడం లేదన్నారు.


టీడీపీ, బీజేపీలతో పొత్తు లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించలేదని.. పొత్తులు ఉన్నా తానే ముఖ్యమంత్రి అని ప్రకటించటం సంతోషమే కదా అన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు దక్కితేనే పొత్తులు అనే సందేశం పవన్ కళ్యాణ్ ఇస్తున్నారని.. ఇది నంతోషించాల్సిన విషయమే కదా అన్నారు. జగన్‌‌ను రక్షించటానికే ఈ పని చేన్తున్నారని.. పద్మనాభంపై అభియోగం మోపాల్సి వస్తోందన్నారు. ఇటువంటి పనులు చేయకుండా నోరు మూసుకుని కూర్చుంటే అందరూ సంతోషిస్తారన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa