ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో మానవహక్కులపై అగ్రరాజ్యం ఆందోళన,,,బైడెన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్న సహచర డెమొక్రాట్లు

international |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 10:02 PM

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి అడగడుగునా అక్కడ ఘన స్వాగతం లభిస్తోంది. తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం రెండు రోజుల చర్చల కోసం ప్రధాని నరేంద్ర మోదీని స్వాగతించారు. భారత్‌లో మానవ హక్కుల గురించి అమెరికా ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. ‘మన యుగానికి చెందిన ముఖ్యమైన భాగస్వామ్యాలలో ఒకటి’ అని శ్వేతసౌధం అభివర్ణించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు అంతర్జాతీయ వేదికపై ఉన్న ప్రభావాన్ని పెంచాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తుండగా.. చైనాకు భారత్ వ్యూహాత్మక ప్రతిరూపంగా ఉండాలని అమెరికా కోరుకుంటోంది.


రక్షణ సహకారం, విక్రయాలు, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, మైక్రోన్ టెక్నాలజీ సహా అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులకు సంబంధించిన వివిధ ఒప్పందాల గురించి జో బైడెన్, ప్రధాని మోదీ ప్రకటన చేయనున్నారు. భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తమ ఆందోళనలను మోదీకి తెలియజేయాలని జో బైడెన్ భావిస్తున్నా.. ఈ అంశంపై భారత్ ప్రధానికి ఉపన్యాసాలు ఇవ్వరని వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ విలేకరులతో అన్నారు.


పత్రికా, మత లేదా ఇతర స్వేచ్ఛలకు విఘాతం కలిగితే మేము మా అభిప్రాయాలను తెలియజేస్తామని సుల్లివన్ చెప్పారు. ‘మేము ఉపన్యాసాలు ఇవ్వడానికి లేదా మనకు సవాళ్లు లేవని నొక్కిచెప్పడానికి ప్రయత్నించని విధంగా చేస్తాం’ అని పేర్కొన్నారు. ‘అంతిమంగా భారతదేశంలో రాజకీయాలు, ప్రజాస్వామ్య సంస్థల ఎక్కడికి వెళుతుందనే ప్రశ్న ఆ దేశ ప్రజలే నిర్ణయించుకుంటారు... ఈ విషయంలో అమెరికా జోక్యం ఏం ఉండదు’ అని సుల్లివన్ స్పష్టం చేశారు.


ఇదిలావుంటే 2014లో ప్రధాని అయిన తర్వాత మోదీ ఐదుసార్లు అమెరికాకు వెళ్లారు కానీ, అధికారిక పర్యటనకు సంబంధించిన పూర్తి దౌత్య హోదాలో ఇది మొదటిది. కాగా, ప్రధాని మోదీతో మానవ హక్కుల అంశం గురించి ప్రస్తావించాలని జో బైడెన్ తోటి డెమొక్రాట్ల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జో బిడెన్, మోదీ ఇద్దరూ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. అయితే, ఈ వాదనను సుల్లీవన్ కొట్టిపారేశారు. ‘ఈ పర్యటన చైనా గురించి కాదు.. అయితే సైనిక, సాంకేతిక, ఆర్థిక రంగాలలో చైనా పాత్ర గురించి ఎజెండాలో ఉంటుంది.’ అని చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa