ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడుకొనేందుెకు వెళ్లగా... పిల్లలకు చోట దొరికిన బంతిలా ఉన్న బాంబు,,ఆపై ఊహించని ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 10:02 PM

పిల్లలు బంతితో ఆటాడుకుంటుండగా బాంబు పేలి ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. అయితే, బంతి అనుకుని బాంబుతో ఆటలాడుతుండగా పేలుడు సంభవించింది. ఈ షాకింగ్ ఘటన పశ్చిమబెంగాల్‌ లోని ముర్షీదాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇమామ్‌నగర్‌‌లోని ఓ మామిడి తోటలో ఆడుకోడానికి పిల్లలు వెళ్లారు. వారికి అక్కడ బంతి ఆకారంలో ఉన్న ఓ వస్తువు దొరకిందని, దానితో ఆటలాడుతుండగా బాంబు పేలిందని చెప్పారు. దీంతో ఐదుగురు పిల్లలకు గాయలయ్యాయని తెలిపారు.


తక్షణమే చిన్నారులను చికిత్స కోసం బెనియాగ్రామ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఫరక్కా పోలీస్ స్టేషన్ అధికారి దేబబ్రత చక్రవర్తి అధ్వర్యంలో పోలీస్ బృందం ఘటనా స్థలిలో క్షుణ్ణంగా పరిశీలించింది. ఇదిలా ఉండగా, బాంబు పేలుడు ఘటనతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.


ఆట స్థలంలో బాంబు పేలుడు ఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతల్లో డొల్లతనం మరోసారి రుజువైందని విపక్షాలు మండిపడుతున్నాయి. బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ల వేళ పలు ప్రాంతాల్లో బాంబులు, రాళ్లు దాడుల వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల అల్లర్లు జరిగిన దక్షిణ 24 పరగణాల్లో పర్యటించిన బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్.. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమై టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


జులై 8న ఒకే విడతలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్ ప్రక్రియలో భాగంగా గత వారంలో చెలరేగిన అల్లర్లలో కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, బెంగాల్‌లోని సున్నితమైన జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే, బెంగాల్ ప్రభుత్వ అభ్యర్థను సుప్రీంకోర్టు మంగళవారం నాడు తోసిపుచ్చింది. బెంగాల్‌లో ఒకేరోజులో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరగాలన్నదే హైకోర్టు ఆదేశాల వాస్తవ ఉద్దేశమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa