పలు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతల పెరుగుదలతో అసాధారణ పరిస్థితులు నెలకున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్ మొదలైనా ఎండలు ఏ మాత్రం తగ్గకపోగా.. పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాల్లో అధిక ఎండలు, వేడి తీవ్రతను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత వాతావరణ విభాగం సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులను అంచనా వేయడం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ, ఐఎండీ విభాగానికి చెందిన ఐదుగురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఆయా రాష్ట్రాలల్లో పర్యటించనుందని కేంద్ర మంత్రి మాండవియా తెలిపారు. వేడి గాలులు, వాతావరణ పరిస్థితుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలను సూచించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ని కూడా కోరినట్టు కేంద్రమంత్రి పేర్కొన్నారు.
‘వేడి తీవ్రత ప్రభావం నుంచి సాధారణ ప్రజలను రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపడతాం.. వడదెబ్బ కారణంగా ఏ ఒక్కరూ చనిపోరాదు’ అని మంత్రి చెప్పారు. ఇందుకు తగిన సూచనలు, సలహాలు చెప్పాలని ఐసీఎంఆర్ను కోరామని పేర్కొన్నారు. ఎండలు అధికంగా ఉన్న రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో వర్చువల్గా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
ఉత్తర్ ప్రదేశ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఎండలు తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రాబొయే రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన నుంచి అతి తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని వాతవారణ శాఖ అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా యూపీ, బిహార్ వంటి పలు రాష్ట్రాల్లో వేడి గాలులు, వాతావరణ పరిస్థితి కారణంగా మరణాలు పెద్ద సంఖ్యలో నమోదు కావడంతో కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. అటు, ఎండల తీవ్రత దృష్ట్యా పలు రాష్ట్రాలు వేసవి సెలవులను పొడిగిస్తున్నాయి.
అయితే, ఉష్ణోగ్రతల విషయంలో ఐఎండీ మూడు నెలల ముందే హెచ్చరికలు చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య దేశంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని తెలిపింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం.. వేసవి కాలంలో సంభవించే సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతల కాలాన్ని వడగాల్పులు అంటారు. ఇవి సాధారణంగా మార్చి మరియు జూన్ మధ్య సంభవిస్తాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో జూలై వరకు కూడా విస్తరిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa