ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీని గద్దె దించడమే లక్ష్యంగా,,,,బిహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన సమావేశం

national |  Suryaa Desk  | Published : Fri, Jun 23, 2023, 09:31 PM

దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న విపక్షాల సమావేశానికి వేళ అయింది. బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీశ్ కుమార్ అధ్యక్షతన.. శుక్రవారం పాట్నాలో భేటీ అవుతున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు సహా వివిధ ప్రాంతీయ పార్టీలు హాజరు కానున్నాయి. 2024 ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా చర్చించనున్నారు. పాట్నాలోని నితీశ్ కుమార్ నివాసం నెక్ సంవాద్ కక్ష్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ భేటీకి దేశంలోని 15 పార్టీలకు సంబంధించిన అధినేతలు, ముఖ్యనేతలు పాల్గొంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం జరిగే భేటీ కోసం వివిధ పార్టీలకు చెందిన నేతలు.. గురువారం సాయంత్రం వరకే పాట్నాకు చేరుకుంటారని పేర్కొన్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ ప్రతిపక్షాల సమావేశం ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు సాగుతుందని తెలిపాయి.


జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సహా తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా పలువురు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ, బీఎస్పీ ప్రకటించాయి.


అయితే 2024 ఎన్నికల్లో కూటమిగా పోటీచేయాలని భావిస్తున్న విపక్షాలు.. ఈ సమావేశం ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న దానిపై చర్చించేందుకు కాదని ఇప్పటికే వివిధ పార్టీలు తేల్చి చెప్పాయి. భావ సారూప్యక కలిగి ఉన్న పార్టీలన్నీ కలిసి ఒకతాటిపైకి వచ్చి ఐకమత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దేశంలో ఓడించడమే ప్రధాన లక్ష్యంతో ఈ ప్రతిపక్షాల భేటీ కొనసాగనుంది. విపక్షాల ఐక్యత కోసం.. భవిష్యత్‌లో నిర్వహించబోయే సమావేశాలకు ఈ భేటీ తొలి అడుగు అని వివిధ పార్టీల నేతలు తెలిపారు. మొదట మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో నెలకొన్న సమస్యలు, ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉండాల్సిన అవసరంపై నితీశ్ కుమార్ కీలక ప్రసంగం చేయనున్నారు. తర్వాత మల్లికార్జున ఖర్గే, కేజ్రీవాల్‌ మాట్లాడనున్నారు.


ఈ విపక్షాల ఐక్యత సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే విషయంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయనే విషయాన్ని ఈ సమావేశం ద్వారా దేశ ప్రజలకు తెలియజేయాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితులను పక్కన పెట్టి.. బీజేపీపై ఉమ్మడి పోరాటం సాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు.. పార్టీలు సహకరించుకునేలా చర్చలు జరపనున్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ బలం లేని చోట్ల కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీల మధ్య పోరు ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఎలా ముందుకు సాగాలి అన్నదానిపై భేటీలో చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు గట్టి పోటీని ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కొన్ని చోట్ల త్యాగాలు చేయవలిసి వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఒప్పించే ప్రయత్నాలు కూడా ఈ భేటీలో జరగనున్నట్లు తెలుస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa