కునో నేషనల్ పార్కులో సంరక్షిస్తోన్న చీతాల మధ్య ఘర్షణ జరిగి, ఓ మగ చీతా తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం రెండు వర్గాలు చీతాలు విడిపోయి ఘర్షణపడినట్టు కునో అధికారులు తెలిపారు. ఈ ఘర్షణలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన అగ్ని అనే మగ చీతా గాయపడినట్టు పేర్కొన్నారు. గాయపడిన చీతాకు చికిత్స కొనసాగుతోందని, క్రమంగా దాని ఆరోగ్యం మెరుగుపడుతోందని వివరించారు. కాగా, గత మూడు నెలల్లోనే మూడు కూనలు సహా ఆరు చీతాలు పలు కారణాలతో కునో జాతీయ పార్కులో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో కునో పార్కులో చీతాల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో అంతరించిపోయిన జంతువులుగా ఏడు దశాబ్దాల కిందట 1952లో ప్రకటించారు. అయితే, మళ్లీ గతేడాది ఇవి దేశంలోకి అడుగుపెట్టాయి. 2020లో ఈ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను తీసుకొచ్చి సంరక్షించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో నమీబియా నుంచి 8 చీతాలను గతేడాది సెప్టెంబరులో తీసుకొచ్చి.. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం రోజున కునో నేషనల్ పార్కులో వదిలిపెట్టారు. అనంతరం మరో 12 చిరుతలను ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు.
ఇవన్నీ ప్రస్తుతం కునో నేషనల్ పార్కులోనే ఉన్నాయి. వీటి సంరక్షణకు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ మార్గదర్శకాలను అనుసరిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణలో భారతదేశానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1972లో ప్రారంభించిన అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమంలో ఒకటి 'ప్రాజెక్ట్ టైగర్', పులుల సంరక్షణకు మాత్రమే కాకుండా మొత్తం పర్యావరణ వ్యవస్థకు కూడా దోహదపడింది.
భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువైన చీతాలు ఒకప్పుడు మన దేశమంతటా ఉండేవి. కానీ బ్రిటిషర్ల హయాంలో విపరీతమైన వేట, అడవులు నరికివేత తదితర కారణాలతో 1952 నాటికి అంతరించిపోయాయి. ప్రపంచంలో చీతాను బంధించి పెంచిన తొలి ఘటన మన దేశంలో చోటు చేసుకుంది. 16వ శతాబ్దంలో మొఘల్ పాలకుడైన జహంగీర్ హయాంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa