బెంగళూరు నగర నిర్మాత కెంపెగౌడ జయంత్రి సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఉద్దేశించి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో సీఎంగా సిద్ధూ ఓ ప్రాజెక్ట్ విషయంలో భయపడ్డారని.. నైనేతే అలా భయపడేవాడ్ని కాదని వ్యాఖ్యానించారు. దీంతో ఇది మరోసారి కన్నడ రాజకీయాలు వేడెక్కడమే కాకుండా సిద్ధూ, డీకే సఖ్యత మూన్నాళ్ల ముచ్చటేననే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
కెంపేగౌడ జయంతి సందర్భంగా మంగళవారం విధానసౌధ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టన్నెల్స్, ఫ్లైఓవర్లు నిర్మించాలని పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నాయి. అయితే అలాంటి ప్రాజెక్టుల విషయంలో చాలా సవాళ్లు ఎదురవుతాయి. ఇలాగే, 2017లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులో స్టీల్ ప్లైఓవర్ నిర్మాణం తలపెట్టింది. అయితే దానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.. ఆందోళనలకు అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జ్ భయపడ్డారు. అదే నేనైతే.. అలాంటి నిరసనలకు తలొగ్గేవాణ్ని కాదు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ముందుకెళ్లేవాణ్ని’’ అని డీకే వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో డీకే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది. సిద్ధరామయ్య, డీకే మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. అయితే, డీకే వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి, మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే స్పందించారు.
‘‘సిద్ధరామయ్య భయపడ్డారని నేను చెప్పను.. ప్రజల అభిప్రాయాలతో సీఎం సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంటుంది. డిప్యూటీ సీఎం ఆ ఉద్దేశంతోనే చెప్పారేమో’’ అని వ్యాఖ్యానించారు.
గత నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని అందుకోవడంతో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధూ, డీకే మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. చివరకు కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి తలొగ్గి సీఎం రేసు నుంచి డీకే శివకుమార్ వైదొలిగారు. దీంతో సిద్ధరామయ్య రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి సమష్టిగానే ప్రభుత్వాన్ని నడుపుతున్నా.. ప్రతిపక్ష బీజేపీ మాత్రం విమర్శలు ఎక్కుపెడుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే కూలిపోతుందని కమలం నేతలు జోస్యం చెబుతున్నారు.
కొన్ని రోజుల కిందట బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్పై ఎటువంటి చర్య తీసుకోవద్దని కాంగ్రెస్ను బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.అశోక హెచ్చరించింది. ‘సీఎం సిద్ధరామయ్య మౌనంగా ఉన్నా డిప్యూటీ సీఎం శివకుమార్ మాత్రం క్రూరంగా వ్యవహరిస్తున్నారు.. ప్రతి మీటింగ్లో శివకుమార్ సీఎం కంటే ముందే మాట్లాడుతున్నారు’ ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa