గత కొన్ని రోజులుగా మణిపూర్లో చెలరేగిన హింసాత్మక ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర సీఎం ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు అందించేందుకు రాజ్భవన్కు బయల్దేరారు. అంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన మద్దతుదారులు.. పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేయడంతో వెనక్కి తగ్గారు.
రాజీనామా వార్తలు.. వాటితో తన మద్దతుదారుల నిరసనల నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను రాజీనామా చేయడం లేదని ట్విటర్లో వెల్లడించారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలన్నీ అసత్యాలని తేల్చి చెప్పారు. అయితే ఈ క్రమంలోనే బీరెన్ సింగ్ రాజీనామా పత్రం చించేసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రాజీనామా పత్రంతో రాజ్భవన్ బయల్దేరిన బీరెన్ సింగ్.. తన అభిమానుల ఒత్తిళ్లతో చివరి నిమిషంలో మనసు మార్చుకుని వెనక్కి వచ్చారనే వార్తలు వెలువడుతున్నాయి.
మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేస్తున్నారని.. శుక్రవారం ఉదయం నుంచి కోకొల్లలుగా వార్తలు వెలువడ్డాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన రాజ్భవన్కు చేరుకుంటారని.. గవర్నర్ అనసూయ ఉకియ్తో సమావేశం అవుతారని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఇందులో భాగంగా ఆయన ఇంటి నుంచి బయల్దేరిన వీడియోలు కూడా అన్ని మీడియాల్లో ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా తథ్యం అని అందరూ భావించారు. అయితే ఈ వార్తలు బయటకు రాగానే బీరెన్ సింగ్ ఇంటికి.. ఆయనకు మద్దతుగా మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రాజీనామా నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మార్చుకోవాలని నినాదాలు చేశారు. బీరెన్ సింగ్ను రాజ్భవన్కు వెళ్లనీయం అంటూ మానవహారంలా ఏర్పడ్డారు.
ఇంఫాల్లోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన బీరేన్ సింగ్ కాన్వాయ్ను ముందుకు కదలకుండా మహిళలు అడ్డుకున్నారు. దీంతో తిరిగి తన నివాసం లోపలికి ముఖ్యమంత్రి వెళ్లారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే చించేసిన రాజీనామా పత్రాలు కన్పించడం గమనార్హం. వీటిని మహిళా మద్దతుదారులు చించినట్లు కొన్ని వీడియాలు బయటికి వచ్చాయి. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ చేతుల్లో నుంచి రాజీనామా లేఖను లాక్కుని మహిళలు చించినట్లు తెలుస్తోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇంఫాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మణిపూర్లో మెజారిటీలు మెయితీలు కాగా.. కుకీలు మైనారిటీ వర్గాలుగా ఉన్నారు. ఇప్పటివరకు కుకీలు ఎస్టీ జాబితాలో ఉండగా.. తమను కూడా అదే జాబితాలో చేర్చాలని మెయితీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే మే 3 వ తేదీన కుకీలు నిర్వహించిన గిరిజన సంఘీభావ ర్యాలీపై మెయితీలు రాళ్లు విసరడం హింసాత్మక ఘటనలకు బీజం పడింది. నేతల ఇళ్లకు నిప్పంటించడం, మూకదాడులకు పాల్పడటం వంటివి రోజురోజుకూ పెరుగుతున్నాయి. దాదాపు 2 నెలలుగా 50 కొనసాగుతున్న అల్లర్లలో 120 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేల మంది సైన్యం, ప్రత్యేక బలగాలను రంగంలోకి దించినా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించినా ఇప్పటికీ పలు చోట్ల అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మణిపూర్లో ఉద్రిక్తతలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. బీజేపీ అధిష్ఠానమే రాజీనామా చేయాలని బీరెన్ సింగ్కు సూచించినట్లు వార్తలు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa