ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు లింగమార్పిడి చికిత్సతో పురుషుడిగా మారింది. ఇందుకు సంబంధిత ధ్రువీకరణ పత్రం కూడా ఆమె పొందారు. షాజహాన్పుర్ జిల్లా ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాడా గ్రామానికి చెందిన భారత స్వాతంత్య్ర పోరాటంలో అమరుడైన ఠాకూర్ రోషన్ సింగ్ మునిమనవరాలు సరితాసింగ్ టీచర్గా పనిచేస్తుంది. దివ్యాంగురాలైన ఆమెకు చిన్నతనం నుంచి అబ్బాయిల్ని దుస్తులు ధరించడం, వారిలా హెయిర్స్టైల్ చేసుకోవడం ఇష్టం. అమ్మాయిగా పుట్టినా ఆమె ప్రవర్తన అచ్చం అబ్బాయిలాగే ఉండేది.
డిగ్రీ పూర్తిచేసిన సరితా సింగ్కు మూడేళ్ల కిందట ప్రాథమిక విద్యా మండలిలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. 2020లో లింగమార్పిడి చేయించుకుని అబ్బాయిగా మారాలని నిర్ణయించుకుని.. లక్నోలో హార్మోన్ మార్పిడి థెరపీ తీసుకుంది. దాంతో పురుషుడిలా గొంతు మారడం, గడ్డం రావడం వంటి మార్పులు కనిపించాయి. ఈ నేపథ్యంలో మూడు నెలల కిందట మధ్యప్రదేశ్లోని ఇండోర్లో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని పూర్తిగా పురుషుడిగా మారింది. తన పేరును శరత్ సింగ్గా మార్చుకున్నారు.
షాజహాన్పుర్ జిల్లా మేజిస్ట్రేట్ ఉమేశ్ ప్రతాప్ సింగ్ నుంచి లింగమార్పిడి ధ్రువీకరణ పత్రం కూడా ఆమె అందుకున్నారు. దివ్యాంగురాలైన సరిత ఎక్కువ సమయం చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. అయితే, సవితా సింగ్ అనే యువతి ఆమెకు సహకరిస్తూ... చదువులో కూడా అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో సవితను తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ప్రస్తుతం శరత్ సింగ్ నిర్ణయించుకున్నారు. ఆమె కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.
జన్యుపరమైన లోపాలు, హార్మోన్ల ప్రభావంతో కొందరు ట్రాన్స్జెండర్గా మిగిలిపోతారు. సమాజం నుంచి ఎలాంటి గుర్తింపు, ఆదరణ లేక చాలా దయనీయ స్థితిలో జీవిస్తున్నారు. తమకు ఉపాధి లభించక.. ప్రభుత్వం ఆదుకోక, సమాజంలో వేధింపులకు గురవుతున్నారు. అయితే, కొందరు మాత్రం అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విధానాలతో లింగమార్పిడి చేయించుకుని తమకు నచ్చిన విధంగా జీవిస్తున్నారు. ఇటీవలే పశ్చిమ్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సైతం తాను లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారనున్నట్టు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa