రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టు దొంగ అని.. ఎమ్మెల్యేలను తనపైకి పంపిస్తున్నారని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులను మొదట తనపైకి పంపించారని.. ఆ తర్వాత కోడిగుడ్లు వేయించారని చెప్పారు. అయితే, మన వాళ్లు ఆమ్లెట్లు వేసి పంపించారని ఎద్దేవా చేశారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 143వ రోజు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా ముత్తుకూరులో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ.. ఊరికొక సత్య నాదెళ్లను తయారు చేస్తానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి.. ఊరికొక అనంతబాబు (వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు)ను తయారు చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రాన్ని గంజాయి వ్యాపారంతో నింపేశారని.. సైకో జగన్కు బిల్డప్ తప్ప ఏమీ లేదని లోకేష్ అన్నారు. పన్నులతో ప్రజలపై బాదుడే బాదుడు అని.. దేశ చరిత్రలో 100 పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జాబ్ క్యాలెండర్ లేదని.. మెగా డీఎస్సీ లేదని పేర్కొన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని.. సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం మైనారిటీలను వేధించిందన్నారు. ఇక, నెల్లూరు సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు సీటు లేదని చెప్పడంతో ఫ్రస్టేషన్తో ఏదేదో మాట్లాడుతున్నారని నారా లోకేష్ విమర్శించారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ.. సంస్కారం లేని కాకాణి గోవర్ధన్ రెడ్డి పోటీగా పోస్టర్లు వేయించారని చెప్పారు. పోలీసులకు పౌరుషం లేదని.. దమ్ముంటే రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి ఒక్క జీవో తీసుకురా అని సవాల్ విసిరారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి తనపై అక్రమ కేసులు పెట్టించారని.. దమ్ముంటే అరెస్టు చేయించాలన్నారు. అన్నదాతలు ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచకంగా మార్చారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa