చిత్తూరు డెయిరీని అమూల్ కంపెనీకి దారాదత్తం చేయడం సరికాదని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డికి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. చిత్తూరు డెయిరీని అమూల్కు అప్పగించడమంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు. ఇక్కడి ప్రజల సంపద, సహకార డైయిరీల రూ. వేల కోట్ల విలువైన ఆస్తులను అమూల్కు కట్టబెడతారా అని ప్రశ్నించారు.
దశాబ్దాల కాలం నుంచి ఉన్న సహకార వ్యవస్థను మూసివేసేలా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార డెయిరీలతో పాటు మూతపడ్డ చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి.. ముఖ్యమంత్రి కాగానే మాట మార్చారని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహకార డెయిరీలను బలహీనపరిచేలా గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ సంస్థను ఏపీకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పేరుతో అమూల్కు కట్టబెడుతుండటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో పాడి రైతులకు ద్రోహం చేస్తున్నారని.. ఇప్పటికే మౌలిక వసతులు, ఇతర సహకార డెయిరీల ఆస్తులు కలిపి రూ. 6 వేల కోట్ల ప్రజా సంపదను అమూల్కు దోచి పెడుతున్నారని ఆరోపించారు.
చిత్తూరు డెయిరీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అమూల్కు ఏడాదికి కోటి రూపాయిల లీజుపై 99 ఏళ్లకు అప్పగించారని.. చిత్తూరు డెయిరీకి చెందిన రూ. 650 కోట్ల ఆస్తులను సైతం కట్టబెట్టారని అచ్చెన్నాయుడు విమర్శించారు. చిత్తూరు నగరంలో కలెక్టరేట్ సమీపాన ప్రధాన రహదారిపై ఉన్న 33 ఎకరాలతో పాటు వి.కోట, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి, పిచ్చాటూరులో చిల్లింగ్ సెంటర్లు కూడా అప్పజెప్పారని తప్పుబట్టారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల నుంచి తెప్పించిన సామగ్రి విలువ సుమారు రూ. 30 కోట్లు పైనే ఉంటుందని.. ఈ సంపదనంతా సీఎం జగన్.. అమూల్కు అప్పనంగా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి చిత్తూరు డెయిరీ వ్యవస్థాపకుడి విగ్రహం సైతం కూలగొట్టడం ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనం కాదా అని దుయ్యబట్టారు. స్థానికంగా ఉండే డెయిరీలను కాదని ఎక్కడో గుజరాత్కు చెందిన అమూల్ను తీసుకురావడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa