ఏపీలో మరో 9 నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. పార్టీ వైపు నుంచి నియోజకవర్గాలపై సమీక్షలు చేస్తూ.. పెండింగ్ నియోజకవర్గాలకు ఇంఛార్జ్లను నియమిస్తున్నారు. దాదాపు అన్నిచోట్ల కొలిక్కిరాగా.. ఒకటి, రెండుచోట్ల మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అలాగే ఇటీవల కాలంలో పలు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు భారీగా నమోదయ్యాయంటూ టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో బోగస్ ఓట్లు పెద్ద సంఖ్యలో నమోదు చేస్తున్నారని.. అలాగే అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని టీడీపీ నేతలు కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వైపు నుంచి ఓ కీలక కమిటీకి రూపకల్పన చేశారు. ఎనిమిది మందితో ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పి.కృష్ణయ్య, ఎస్.రాజశేఖర్ (ఇంఛార్జ్), పి.కృష్ణమోహన్, వజ్జా శ్రీనివాసరావు, చిరుమామిళ్ల ప్రసాద్, కోనేరు సురేష్లను సభ్యులుగా నియమించారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో ఈ ఎనిమిదిమందితో ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని నియమించినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ జాబితాలపై పర్యవేక్షణ చేయనుంది. వీరు ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు. రాష్ట్రంలో భారీగా దొంగ ఓట్లు నమోదు చేసినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. అదే క్రమంలో అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించారంటోంది. ఒకే డోర్ నంబర్లో చాలామంది ఓటర్లుగా చేర్చారని.. ఇలా వివిధ జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో 2,150 డోర్ నంబర్లతో లక్షా 85వేల దొంగ ఓట్లు చేర్పించారని టీడీపీ ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్కుమార్ మీనాకు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ దొంగ ఓట్లకు సంబంధించిన ఆధారాలను అందజేసి, వాటిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఒక్కో ఇంట్లో 50 నుంచి 500 దొంగ ఓట్లు చేర్పించారని.. వ్యవస్థలను మేనేజ్ చేసి, ప్రతిపక్షాల ఓట్లను తారుమారు చేసి.. దొంగ ఓట్లతో విజయం సాధించాలని ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. జులై 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాల పరిశీలన జరుగుతుందని.. ఈ ప్రక్రియ అక్టోబరు 7 వరకు సాగుతుందని.. బూత స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి ఓటరునూ పరిశీలించి, ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేస్తారని సీఈవో తమకు చెప్పినట్లు టీడీపీ నేతలు తెలిపారు. అక్టోబరు 17 నాటికి ముసాయిదా జాబితా వస్తుందని.. దానిని పరిశీలించి, ఇంకా దొంగ ఓట్లుంటే ఆధారాలతో మరోసారి ఫిర్యాదు చేస్తే.. అప్పుడు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తమతో చెప్పారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa