యువగళం సభలో తనపై చేసిన ఆరోపణలపై ప్రమాణాలకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్కు సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణల మీద తిరుమల కొండపై ప్రమాణానికి రావాలన్నారు.. నిజం చెబితే తల పదివేల ముక్కలవుతుందని లోకేష్కు శాపం ఉందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల్లూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా కౌంటరిచ్చారు.
నెల్లూరు జన సమీకరణ కోసం లోకేష్ ఒక రోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారన్నారు అనిల్. సభ పెట్టిన పక్కనే ఉన్న NTR విగ్రహానికి పూలమాల కూడా వెయ్యకపోవడం సిగ్గు చేటన్నారు. రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా.. ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్కి ఉందా అన్నారు. కార్పొరేటర్లు లే అవుట్లు వేస్తే.. దాన్ని కూడా తానే వేసినట్లు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. చెన్నైలో తాను రూ.50 కోట్లతో ఇల్లు కొనుగోలు చేసినట్లు ఆరోపించారని.. కానీ తాను అద్దె ఇంట్లో ఉంటానని చెప్పారు. డాక్యుమెంట్తో సహా తీసుకొచ్చి మీడియాకు విడుదల చేశారు.
గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన అజీజ్ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 30 ఏళ్ల పాటూ రాజకీయ పార్టీలు తిరిగినా.. ఎవరూ టికెట్ ఇవ్వకపోతే జగన్ రెండు సార్లు శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చారన్నారు. లోకేష్కు దమ్ముంటే తన ఛాలెంజ్ స్వీకరించాలని.. నెల్లూరు సిటీలో పోటీ చేయాలన్నారు. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరోసారి స్పష్టం చేశారు.
అభివృద్ది మీద చర్చకు సిద్ధమని లోకేష్ ప్రకటిస్తే.. అర గంటలో వస్తానన్నారు అనిల్. యుద్దానికి రమ్మని పిలిచినా వస్తా.. లోకేష్ 10 వేల మందిని తెచ్చుకోవచ్చని.. తాను కేవలం 100 మందితోనే వస్తానన్నారు. సభలో స్టేజిపై నుంచి చర్చకు పిలవడం కాదు.. ఇప్పుడు చర్చకు రావాలన్నారు. ఇవాళ 2 గంటల వరకు టైం ఇస్తున్నట్లు చెప్పారు.. భయం తన బ్లడ్ లోనే లేదన్నారు. లోకేష్కు దమ్ముంటే 2024లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తన గెలుపును ఆపాలన్నారు. గంజాయి కేసుల్లో దొరికిన వారందరూ టీడీపీ నేతలేనని.. కొన్ని పేపర్ క్లిప్పింగ్లను మీడియా ముందుకు తీసుకొచ్చారు. తనపై ఎలాంటి కేసులు లేవని.. బెట్టింగ్ కేసులు ఉన్న వాళ్ళందరూ లోకేష్ పక్కనే ఉన్నారన్నారు. గతంలో నారాయణ తనకు రూ.50 లక్షలు ఇంటికి పంపితే.. వెనక్కు పంపినట్లు చెప్పుకొచ్చారు.
మంగళవారం నెల్లూరులో యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ ఎమ్మెల్యే అనిల్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనిల్ వచ్చే ఎన్నికల తర్వాత నెల్లూరు వదిలేసి చెన్నైకు పారిపోవడం ఖాయమన్నారు. అనిల్ ఏకంగా రూ. వెయ్యి కోట్లు పోగేశారని ఆరోపించారు. ఈ నాలుగేళ్లలో నెల్లూరు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని.. నెల్లూరులో భూ ఆక్రమణలపై టీడీపీ ప్రభుత్వం రాగానే సిట్తో దర్యాప్తు చేయిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa