గుడివాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యంపై కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలను నియోజకవర్గ వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కొడాలి నాని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, మంగళవారం ఓ కేసు వాయిదాలో భాగంగా విజయవాడ కోర్టులో ఆయన హాజరయ్యారని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్, వైసీపీ నేత పాలేటి చంటి వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడదల రజినితో కలిసి ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారని గుర్తు చేశారు.
ఈ నెల 9వ తేదీ గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దివంగత అడపా బాబ్జి జయంతి వేడుకల్లో పాల్గొన్నారని చంటి పేర్కొన్నారు. అనంతరం వేమవరం శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో ఆషాడ మాస ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి శాస్త్రోక్త సారె సమర్పించారని తెలిపారు. అలాగే, అమెరికా నుంచి తన పెద్ద కుమార్తె వస్తుండటంతో ఎమ్మెల్యే కొడాలి నాని ఆదివారం రాత్రి హైదరాబాద్ వెళ్లారని చంటి తెలిపారు.
వాస్తవాలు ఇలా ఉంటే వాట్సప్ గ్రూపుల్లో వచ్చిన తాడు బొంగరం లేని సమాచారాన్ని చిలువలు, పలువలు చేస్తూ ఏదో చేసేద్దామని ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యంపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నారని చంటి మండిపడ్డారు.లోకల్ యూట్యూబ్ ఛానల్స్కు ఉన్నపాటి పరిజ్ఞానం కూడా లేకుండా, ప్రధాన మీడియా ఛానల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయని తప్పుబట్టారు. బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరూ సరైన సమాచారం లేకుండా ఒక ఎమ్మెల్యే ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ప్రసారం చేయరని చంటి అన్నారు.
ఎమ్మెల్యే కొడాలి నానిపై పిచ్చిపిచ్చి కథనాలు ప్రసారం చేస్తే గుడివాడ ప్రజలు చూస్తూ ఊరుకోరని చంటి హెచ్చరించారు. మీడియా కథనాలతో కొడాలి నాని అభిమానులు, వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతుండటంతో తాము మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామని చెప్పారు. సైకో వెధవలు చేసే ప్రచారానికి పార్టీ శ్రేణులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని పాలేటి చంటి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa