చెన్నై- కోల్కతా నగరాలను కలిపే 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ వంతెన.. రెండు ముక్కలైంది. అందులో ఒక భాగం పూర్తిగా ఒరిగిపోయింది. ఈ అనూహ్య ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ మార్గంలో రాకపోకలు నిలిపేశారు. వాహనాలను దారి మళ్లించారు. ఎన్హెచ్-16పై జాజ్పూర్ జిల్లా రసూల్పుర్ వద్ద రెండు వంతెనలు నిర్మించారు. మంగళవారం ఉదయం భువనేశ్వర్ వైపు వెళ్తున్న ఓ బస్సు ఆ వంతెనల్లో ఒక దానిమీదుగా ప్రయాణించింది. బస్సు అలా దాటి వెళ్లగానే వంతెన నిర్మాణంలోని పది అడుగుల ఓ స్పాన్ పెద్ద శబ్దంతో కూలిపోయింది.
దీనిని గమనించి ఓ ట్రాక్టర్ డ్రైవర్తోపాటు కౌఖాయ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ హోంగార్డు వెంటనే అప్రమత్తమయ్యారు. వంతెన పైకి వాహనాల రాకపోకలను నిలిపేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. ‘భువనేశ్వర్ బస్సు వెళ్లిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ గల ఓ వాహనం కూడా వంతెన దాటింది.. ఆ తర్వాత వంతెన కూలిపోయింది. దీంతో మేం ఇతర వాహనాలను బ్రిడ్జి పైకి వెళ్లకుండా ఆపేశాం’ అని హోంగార్డు తెలియజేశాడు. అయితే, ఈ ఘటనలో ఎవరీకి ఎటువంటి గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న నేషనల్ హైవేస్ అథారిటీ సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారుల బృందం పరిశీలించింది. 2008లో నిర్మించిన ఈ బ్రిడ్జి నిర్మాణలోపం కారణంగానే కూలిపోయి ఉండొచ్చని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ (చండీఖోల్) జేపీ వర్మ మీడియాకు తెలిపారు. ‘ఈ ఘటనపై నిపుణుల బృందం దర్యాప్తు చేపట్టింది.. ఆ బృందం ధ్రువీకరణ తర్వాత మేము ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించగలం.. ట్రాఫిక్ను పునరుద్ధరణ, క్రమబద్దీకరణకు నిపుణుల బృందాలను కూడా రప్పించాం’ అని పేర్కొన్నారు. వంతెన మీదుగా వాహన రాకపోకలు నిలిపివేశామని, పోలీసులు, తమ సిబ్బందిని అక్కడ ఉంచినట్టు చెప్పారు. ‘వంతెన కనీసం 50 ఏళ్ల పాటు నిలదొక్కుకోవాలి.. నిర్వహణ కూడా సక్రమంగా జరుగుతున్నందున ఆ సమస్య లేదు.. అకస్మాత్తుగా జరిగిన సంఘటన..’ అని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa