గత రెండు నెలలుగా హింస, అల్లర్లతో హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని ఇంఫాల్కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లాలో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. మే 4న ఈ హేయమైన సంఘటన జరిగినట్లు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ఐటీఎల్ఎఫ్) ఆరోపించింది. ఈ ఘటనకు ముందు ఇంఫాల్ లోయలోని మెజార్టీ వర్గమైన మైతీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
కాగా, మే 4న జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మణిపూర్ పోలీసులు మాత్రం ఈ ఘటన కాంగ్పోక్సిలో జరగలేదని, వేరే ప్రాంతంలో చోటుచేసుకుందని చెబుతున్నారు. దీనిపై కాంగ్పొక్సిలో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఘటనపై మణిపూర్ సీఎం బీరేంద్ర సింగ్ విచారణకు ఆదేశించారు. అటు, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన ఆమె.. నేరానికి పాల్పడినవారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మణిపూర్లోని ఎస్టీ స్టేటస్ కోసం డిమాండ్ చేస్తున్న మైతీ వర్గానికి అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. కుకీ వర్గం దీనిని వ్యతిరేకించడంతో నాటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ హింసలో వందలాది మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
మరోవైపు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మణిపూర్ హింస విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడకపోవడంతో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రెండు నెలలకుపైగా మణిపూర్ హింసతో అట్టుడుకుతుంటే ప్రధాని మౌనంగా ఉన్నారని మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల పట్ల దారుణంగా వ్యవహరించిన వీడియో వెలుగులోకి రావడం విపక్షాలకు మరో అస్త్రం లభించినట్టయ్యింది.
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన 34 పార్టీల నేతలు తమ డిమాండ్లను వినిపించారు. మణిపుర్ పరిస్థితులపై మొదటిరోజే ప్రధానమంత్రి ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని ప్రకటన చేస్తారా? లేదా? అనేది కొద్ది గంటల్లో స్పష్టత రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa