ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు,,,ఘటనా స్థలిలో కొనసాగుతున్న రెస్యూ

national |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2023, 09:17 PM

గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు మహారాష్ట్రలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయిన బాధితుల సంఖ్య 15కు చేరింది. రాయగ‌ఢ్ జిల్లా ఖలాపూర్‌ సమీపంలోని ఇర్షాల్‌ వాడీ కొండ ప్రాంతంలోని గ్రామంలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడి 30 కుటుంబాలకుపైగా శిథిలాల్లో చిక్కుకున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి 25 మంది ఇప్పటి వరకూ బయటకు తీయగా.. వీరిలో నలుగురు మృతిచెందారు. మిగతా 21 మందిని చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేర్చించారు. ఆ ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రివేళలో ఘటన జరగడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడింది.


ప్రస్తుతం రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనగా.. ముంబయి నుంచి మరో రెండు బృందాలు బయలుదేరి వెళ్లాయి. ‘ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌లో పోలీసులు, జిల్లా యంత్రాంగం కలిపి మొత్తం 100 మందికిపైగా పాల్గొన్నారు.. ఎన్డీఆర్ఎఫ్, ఎన్జీఓలు, స్థానికులు కూడా సహకరిస్తున్నారు.. తెల్లవారిన తర్వాత ఇక్కడ పరిస్థితిపై ఓ అవగాహన వస్తుంది’ అని రాయగఢ్ పోలీసులు పేర్కొన్నారు.


ప్రమాద స్థలాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పరిశీలించారు. అనంతరం షిండే మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని చెప్పారు. సహాయక కార్యక్రమాలను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోందని వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నేవీ సిబ్బంది సహా సుమారు 100 మంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు. దాదాపు 75 మంది గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఘటనా స్థలికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పోలీసులు, రెస్క్యూ టీం కాలినడకనే అక్కడకు చేరుకున్నారు.


గత రెండు రోజులు నుంచి మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాయ్‌గఢ్ జిల్లాలోని ఆరు పెద్ద నదులైన సావిత్రి, పాతాళగంగ వంటివి ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కుందాలిక, అంబ, గాధీ, ఉల్హాస్ నదుల్లో ప్రవాహాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు, ముంబయి, రాయ్‌గఢ్, పల్ఘార్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. వీటిలో ఐదు ముంబయిలోనూ పాల్ఘర్,రాయగఢ్, రత్నగిరి, కొల్హాపూర్, సంగ్లీ, నాగ్‌పూర్, థానేలో ఒక్కొక్కటి చొప్పు మోహరించారు. ముంబయిలో ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa