ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు అన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పెత్తందారులపై పేదవాడు సాధించిన విజయంగా అభివర్ణించారు. చరిత్ర ఉన్నంతవరకూ ఇవాళ మరిచిపోలేని రోజని.. ఇంటి పట్టాలు అందించి ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామన్నారు. అమరావతిలో నిరుపేదలకు నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్దిదారులకు నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు.
పేరుకు ఇది రాజధాని పేదలకు ఇళ్లు ఉండొద్దా అని ప్రశ్నించారు సీఎం. పేదలకు వ్యతిరేకులంతా కోర్టుల్లో 18 కేసులు వేసి అడ్డుకోవాలని చూశారని.. మూడేళ్ల పాటూ పేదల తరఫున పోరాటం చేసి విజయం సాధించామన్నారు. ఈరోజు నుంచి ఇది అందరి అమరావతి.. పేదలకు అండగా మార్పు మొదలైందన్నారు. చంద్రబాబు అండ్ కో పేదలకు ఇళ్లు ఇవ్వొద్దని హైకోర్టుకు వెళ్లారని.. పేదలకు ఇళ్లు ఇస్తే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఇళ్లు కట్టిస్తానంటూ గతంలో చంద్రబాబు మోసం చేశారని.. ఇప్పుడు పేదవాడికి ఇల్లు రాకూడదని అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు.
పేదలకు ఇల్లు రాకూడదనేదే వీరందరు కుట్ర చేశారని.. దీని కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలోనే చూశామని.. కానీ చివరికి శత్రువులపై పేదలు సాధించిన విజయమన్నారు. ఇది పెత్తందారులపై పేదల విజయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎందుకు చేయలేదని.. ఈ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు. మంచి చేసే కార్యక్రమాన్ని అడ్డుతగలడమే వీరి లక్ష్యమన్నారు. పేదవాడికి ఏ మంచి పని జరిగినా అడ్డుకోవడమే వీరి పని.. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా.. పెత్తందారుల పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలందరికీ ఈరోజు మరిచిపోలేని రోజని..
పేదలకు మంచి చేస్తుంటే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారని.. చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడే అప్పులు తక్కువ అన్నారు. అన్ని అవరోధాలను దాటుకుని అక్కచెల్లెమ్మల పేరిటే ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నామని.. అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా ఎంతో మంచి చేశాం.. గత ప్రభుత్వం చేయని మంచి చేశామన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు.
ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన తర్వాత సీఆర్డీఏలో పూర్తైన తొలి ఇల్లు కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి జీవరత్నంకు అందజేశారు. జీవరత్నం భర్త వ్యవసాయ కూలీ కాగా.. పేద కుటుంబానికి చెందిన ఆమె వాలంటీర్ కూడా. ఆమె పిల్లలకు అమ్మ ఒడి కింద సాయం.. పొదుపు సంఘంలో ఉన్న ఈమెకు నాలుగు విడతల్లో రూ. 10వేల చొప్పున రుణమాఫీ కూడా జరిగింది. తనకు లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి అందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు జీవరత్నం.
ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో.. మొత్తం 25 లే అవుట్లలో 50,793 మంది పేదలకు ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన సంగతి తెలిసిందే. ఒక్కో ప్లాట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఆ లే అవుట్లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది ప్రభుత్వం. అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, డిజిటల్ లైబ్రరీలు, ఆస్పత్రుల నిర్మాణం కూడా జరగనుంది. ఇలా ఇళ్ల నిర్మాణంతో పాటుగా అన్ని రకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa