మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఓ కల్పితమైన కథ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జ్షీట్లో కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ పార్టీకి, దాని అనుకూల మీడియాకి అవసరమైన మసాలా సరుకుగా సీబీఐ ఛార్జ్షీట్ ఉపయోగపడుతుందని మండిపడ్డారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సీబీఐ చరిత్రలోనే నిలిచిపోతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ విషయంలో బేసిక్ లాజిక్ను సీబీఐ మర్చిపోయిందని చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ వ్యవస్థకు ఓ వైరస్లా పాకారని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య వల్ల ఎవరికి నష్టమో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారన్నారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగిందని చెప్పారు.
వివేకా హత్య కేసులో ఆధారాలను సీబీఐ ఏం చేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కథ ఎలా మలుపు తిరగాలో ఆ విధంగా స్టేట్మెంట్ వస్తుందని పేర్కొన్నారు. గూగుల్ టేక్ అవుట్ నిలబడదని వారికి అర్థమైపోయిందని చెప్పారు. వివేకా హత్య జరిగిన నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారని తప్పుబట్టారు. వివేకా కూతురు సునీత ఇప్పటి వరకు ఆరేడు స్టేట్మెంట్లు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే, కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. వివేకానందరెడ్డి పేరుప్రతిష్టల మీద మచ్చ పడకూడదనే కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన కుటుంబం మౌనంగా భరిస్తూ వచ్చిందని చెప్పారు. వివేకా హత్య కేసులో దోషులు బయటకు రావాలని మొదటి నుంచి కోరుతూనే ఉన్నామని తెలిపారు.
ఈ కేసులో ఏ స్టేట్మెంట్ చూసినా ఒకవైపు మాత్రమే ఉన్నాయని.. చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్లు మార్చారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కేసును ఎంపీ అవినాష్రెడ్డి వైపు మరల్చేందుకు దస్తగిరిని అప్రూవర్గా మార్చారని చెప్పారు. ఆధారాలన్నీ ఒకవైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగిందన్నారు. ఈ విషయంలో వివేకా కుమార్తె సునీతకు వాళ్లు సలహాదారులుగా మారారని ఆరోపించారు. అవినాష్రెడ్డికి ఎంపీ టికెట్ 2011లోనే ప్రకటించారని.. ఆయన గెలుపు కోసం వివేకా కూడా పనిచేశారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa