భారత్లోకి అక్రమ చొరబాట్లు, ఉగ్రదాడులకు పాల్పడుతూ సరిహద్దుల్లో తరచూ కవ్విస్తున్న పాకిస్థాన్కు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్.. మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. భారత దేశాన్ని రక్షించుకునేందుకు మరోసారి గీత దాటేందుకు కూడా ఇండియన్ ఆర్మీ వెనుకాడదని ప్రత్యర్థికి గట్టిగా సమాధానం చెప్పారు. భారత్, పాక్ మధ్య జరిగిన యుద్ధంలో భారత బలగాల విజయానికి గుర్తుగా ఏటా నిర్వహిస్తున్న కార్గిల్ విజయ్ దివస్ వేళ రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాన్ని, దేశంపై దాడిని ఎదుర్కోవడంలో ఇండియన్ ఆర్మీకి.. ప్రభుత్వం, ప్రజలు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తారని తేల్చి చెప్పారు.
భారత దేశ గౌరవాన్ని, ప్రతిష్ఠను కాపాడుకునేందుకు భారత్, పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖను దాటడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సైన్యానికి మద్దతు ఇచ్చేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. లద్ధాఖ్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ యద్ధ స్మారకం వద్ద కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన జులై 26 వ తేదీని దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్గా జరుపుతున్నారు.
పాకిస్థాన్ భారత్కు వెన్నుపోటు పొడిచిందని.. అందుకే మనం కార్గిల్ యుద్ధం చేయాల్సి వచ్చిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. యుద్ధం వచ్చిన ప్రతీసారి, యుద్ధ వాతావరణం నెలకొన్నపుడు ప్రజలు సైన్యానికి, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. సరిహద్దుల్లో అనుక్షణం శత్రుదేశం నుంచి ఎలాంటి ఆపద రాకుండా సైన్యం కాపాడుతోందని.. అలాంటి సమయంలో భారత్ వైపు చూసేందుకు కూడా శత్రు సైన్యం భయపడుతుందని అన్నారు. కేవలం కార్గిల్ యుద్ధమే కాకుండా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సైనికులు తమ ధైర్య సాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో గెలిచినా.. భారత బలగాలు నియంత్రణ రేఖను దాటకుండా శాంతియుతంగా ఉన్నామన్నారు. అంతర్జాతీయ చట్టాలకు భారత్ కట్టుబడి ఉందని.. అందుకే అప్పుడు నియంత్రణ రేఖను దాటలేదని వెల్లడించారు. కానీ అవసరమైతే భవిష్యత్తులో ఎల్ఓసీని దాటుతామని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్లో కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించిన సైన్యం సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అని రాష్ట్రపతి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ భారత సైన్యం ధైర్యాన్ని గుర్తుకు తెస్తుందని.. అది ప్రజలకు ఎంతో స్ఫూర్తినిస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa