దేశంలో లోక్సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటికే ఎన్నికల సంగ్రామంలోకి దూకేశాయి. 2024 లో అధికారం దక్కేది తమకే అంటూ అధికార, విపక్షాలు పోటాపోటీగా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్య చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు.. అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామన్నది కూడా తాజాగా వెల్లడించారు.
ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా.. ఊహించని విధంగా దేశం ఎన్నో విజయాలు సాధిస్తోందని.. ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే భారతదేశ అభివృద్ధి పరుగు ఆగదని అన్నారు. తమ ప్రభుత్వం మరోసారి గెలిచి మూడోసారి అధికారంలోకి రాగానే ప్రపంచంలోనే భారతదేశం మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ తేల్చి చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రగతి మైదాన్లో కొత్తగా తీర్చిదిద్దిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ను ప్రధాని ప్రారంభించారు. అనంతరం జీ-20 సదస్సుకు వేదికైన ఈ కన్వెన్షన్ సెంటర్కు భారత్ మండపం అని పేరు పెట్టారు. ఈ భారత్ మండపం భారతదేశ సత్తాను ప్రపంచానికి తెలియజేస్తుందని.. టూరిజానికి ఉపయోగపడుతుందని తెలిపారు. దేశంలో అభివృద్ధిని ఆపేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని.. ప్రతిపక్షాలను ఉద్దేశించి మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్ బాగా అభివృద్ధి చెందుతోందన్న మోదీ.. 2014 లో ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రయాణించే వారి సంఖ్య 5 కోట్లు కాగా.. ప్రస్తుతం అది 7.5 కోట్లకు చేరిందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి గెలిచి.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తిగా భారత్ ఘనత సాధిస్తుందని తెలిపారు.
భారత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జీ-20 సదస్సును ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ నిర్వహించనున్నారు. 123 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.2,700 కోట్ల వ్యయంతో దీన్ని అత్యాధునిక హంగులతో నిర్మించారు. సెప్టెంబర్లో జరిగే ఈ జీ 20 సదస్సుకు ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు సహా భారీగా వివిధ దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. దేశంలోని దాదాపు 3 వేల మందికి పైగా అతిథులు కూడా హాజరు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa