ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లిం బాలికను అడ్డుకున్న కండక్టర్,,,కండక్టర్‌తో వాగ్వాదానికి దిగిన టీచర్

national |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2023, 09:32 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల పూర్తయ్యాయి. అయితే అంతకుముందు హిజాబ్, హలాల్, టిప్పు సుల్తాన్ అనే అంశాలపై ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు పూర్తయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సంఘటనలు సద్దుమణిగినప్పటికీ తాజాగా మరోసారి అలాంటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉడుపిలోని ఓ నర్సింగ్ కళాశాలలో ఒక వర్గానికి చెందిన విద్యార్థినుల బాత్రూం వీడియోలు తీసిన ఘటన బయటికి వచ్చిన మరుసటి రోజే కలబురగి జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. పాఠశాల విద్యార్థిని బురఖా ధరించలేదని కండక్టర్ బస్సు ఎక్కడాన్ని అడ్డుకోవడం తీవ్ర కలకలంగా మారింది. దీంతో మరోసారి తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.


కలబురగి జిల్లాలోని కమలాపుర బస్‌ స్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పాఠశాల విద్యార్థిని బస్సు ఎక్కుతుండగా.. కండక్టర్ అడ్డుకున్నాడు. ముస్లిం అమ్మాయివి బురఖా ఎందుకు ధరించలేదని ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా ఆమెను బస్సు ఎక్కకుండా ఆపేశాడు. దీంతో ఆ విద్యార్థిని అతనితో గొడవ పడింది. ఇందులో కలగజేసుకున్న ఆ విద్యార్థిని స్కూల్ టీచర్.. బస్ కండక్టర్‌ను వారించాడు. ఈ క్రమంలోనే వారిద్దరికీ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవకు సంబంధించిన వీడియోను అక్కడ ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.


ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను గొడవ జరిగిన స్థలంలో ఉన్న టీచర్‌ నుంచి ఆ పాఠశాల ప్రిన్సిపల్ సేకరించాడు. అనంతరం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఉడుపి జిల్లాలోని ఓ నర్సింగ్ కాలేజీలో హిందూ విద్యార్థినులు బాత్రూమ్‌లోకి వెళ్లిన సమయంలో ముస్లిం విద్యార్థినులు వీడియో తీసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో కళాశాల యాజమాన్యం ముగ్గురు ముస్లిం విద్యార్థినులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa