ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడుకు మరణవార్త విని ఆగిన తల్లి ఊపిరి

national |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2023, 09:47 PM

పిల్లలను చూడకుండా ఏ తల్లిదండ్రులు ఉండలేరు. అయితే ఉన్నత చదువులకో లేక మంచి ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్లే వారి పట్ల అమ్మానాన్నలు చాలా గర్వంగా ఉంటారు. తమ కుమార్తె, కుమారుడు విదేశాల్లో చదువుతున్నారని.. ఉద్యోగం చేస్తారని గొప్పగా చెప్పుకుంటారు. ఆ తల్లి కూడా అలాగే తన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకునేది. అయితే అనుకోకుండా ఆమె కుమారుడు విదేశాల్లోనే చనిపోయాడు. ఈ విషయాన్ని ఆమె వద్ద దాచిన కుటుంబ సభ్యులు.. కుమారుడి మృతదేహం ఎట్టకేలకు విదేశాల నుంచి ఇక్కడికి రావడంతో ఆ తల్లికి అసలు విషయం తెలిసింది. అయితే కుమారుడిని చివరి చూపు చూడకుండానే ఆ తల్లి కూడా కన్నుమూసింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. దీంతో ఒక్కరి మరణంతోనే కుంగిపోయిన ఆ కుటుంబ సభ్యులు.. తల్లి మరణంతో మరింత దుఃఖంలో మునిగిపోయారు.


ఉన్నత చదువులు చదివేందుకు పంజాబ్‌కు చెందిన గుర్‌విందర్‌ నాథ్‌ అనే యువకుడు కెనడాకు వెళ్లాడు. అక్కడ చదువుకుంటూ పార్ట్‌టైం జాబ్‌గా పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. అయితే ఒకరోజు గుర్‌విందర్‌ నాథ్‌పై దుండగులు దాడి చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతిచెందాడు. అయితే ఈ విషయం గుర్‌విందర్‌ నాథ్‌ కుటుంబ సభ్యులకు కెనడాలో ఉన్న భారతీయ రాయబార అధికారులు సమాచారం అందించారు. కుమారుడిపై ఎంతో ఇష్టం ఉన్న గుర్‌విందర్‌ నాథ్‌ తల్లి నరీందర్ కౌర్‌కు.. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని చెప్పలేదు.


చివరికి శుక్రవారం రాత్రి గుర్‌విందర్‌ నాథ్‌ మృతదేహం.. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే అప్పుడు తన కుమారుడు చనిపోయాడన్న విషయం.. అతని తల్లి నరీందర్ కౌర్‌కు తెలిసింది. దీంతో ఆమె విషయం తెలిసిన వెంటనే కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. దీంతో కుమారుడిని చివరి సారి చూసుకునే భాగ్యం కూడా ఆ తల్లికి లేకపోయింది. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు గుర్‌విందర్‌ నాథ్‌, నరీందర్ కౌర్ అంత్యక్రియలను.. కుటుంబ సభ్యులు ఒకేసారి నిర్వహించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.


పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల గుర్‌విందర్‌ నాథ్‌ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. ఒంటారియో ప్రావిన్స్‌లో చదువుతూనే పార్ట్‌టైమ్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జులై 9 వ తేదీన మిస్సిసాగా ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు గుర్‌విందర్‌ వెళ్లగా.. అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో అది గుర్తించిన స్థానికులు.. గుర్‌విందర్ నాథ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన గుర్‌విందర్ నాథ్.. జులై 14 వ తేదీన మృతి చెందినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్‌ కార్యాలయం తెలిపింది. దీంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి మృతదేహాన్ని పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువిందర్‌ మృతదేహాన్ని శుక్రవారం భారత్‌కు తరలించారు. ఈ ఘటన విని ఆయన తల్లి తనువు చాలించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa